చంద్రబాబుకు ఏ మాత్రం సెంటిమెంట్స్ లేవు. అధికారాన్ని తప్ప, ఆయనకు ఏదీ ప్రీతిపాత్రమైంది కాదు. అందుకే పిల్లనిచ్చిన మామను కూడా పదవీచ్యుతుడిని చేయడానికి వెనుకాడలేదని సొంత పార్టీ వాళ్లు కూడా అంటుంటారు. రాజకీయంగా తనకు లాభదాయకం అనుకుంటే ఎవరినైనా ముద్దాడేందుకు ఆయన సంకోచించరు. రాజకీయంగా నష్టమనుకుంటే నిజానిజాలతో సంబంధం లేకుండా ఎల్లో మీడియా ద్వారా బద్నాం చేయడానికి కుట్ర పన్నుతారనే విమర్శ ఆయనపై వుంది.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై చంద్రబాబు విమర్శలను చూస్తే, ఆశ్చర్యం కలుగుతోంది. వైఎస్ జగన్ రాజకీయ అరంగేట్రం చేసిన మొదలు చంద్రబాబు ఆయనపై చెడు ప్రచారాన్ని మొదలు పెట్టారు. వైఎస్సార్ మరణం, ఆ తర్వాత జగన్ సొంత పార్టీ పెట్టుకోవడంతో రాజకీయ ప్రమాదాన్ని చంద్రబాబు గుర్తించారు. లక్ష కోట్లు దోచుకున్నాడంటూ జగన్పై పెద్ద ఎత్తున విష ప్రచారాన్ని చేశారు. అయితే చంద్రబాబు కుట్రలు జగన్ను సీఎం కాకుండా అడ్డుకోలేకపోయాయి.
ఎందుకంటే చంద్రబాబు వ్యూహాల్ని, కుట్రల్ని తెలుగు సమాజం గుర్తించింది. దీంతో ఆయన విమర్శలకి విలువ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో తాజాగా జగన్పై చంద్రబాబు విమర్శలపై నెటిజన్లు తమదైన రీతిలో చురకలు అంటిస్తున్నారు.
“తల్లిని చూడలేని వ్యక్తి, చెల్లికి తండ్రి ఆస్తిలో భాగం ఇవ్వలేని వ్యక్తి, బాబాయిని గొడ్డలి వేటుతో లేపిన వ్యక్తి నిన్ను, నన్ను కాపాడుతాడా?” అని చంద్రబాబు ప్రశ్నించడంపై నెటిజన్లు మరో రకంగా ఆలోచించడం గమనార్హం. ఇదే పవన్కల్యాణ్ రాజకీయ ప్రత్యర్థి అయి వుంటే, జగన్ కంటే ఘోరంగా ఆయన వ్యక్తిగత జీవితాన్ని చంద్రబాబు, ఎల్లో మీడియా టార్గెట్ చేసేవారని అంటున్నారు.
మూడు ముళ్ల బంధంతో ఒక్కటై, ఏడడుగులు నడిచి… జీవితాంతం కష్టనష్టాల్లోనూ, సుఖ దుఃఖాల్లోనూ ఇతరత్రా అన్ని విషయాల్లో కలిసి జీవిస్తామని అగ్ని సాక్షిగా ఒకరి తర్వాత మరొకరు…ఇలా ముగ్గుర్ని పెళ్లాడి, వారిని సరిగా చూసుకోలేని నాయకుడు నిన్ను, నన్ను ఉద్దరిస్తారా? అని నిలదీసేవాడని వ్యంగ్యంగా పోస్టులు పెట్టడం చర్చనీయాంశమైంది. పవన్కు స్థిరత్వం లేదని, అందుకే ముగ్గురి ఆడపిల్లల జీవితాల్ని నాశనం చేశారని, అలాంటి వ్యక్తికి అధికారం ఇస్తే, మనల్ని బతకనిస్తారా? అని చంద్రబాబు నిలదీసేవాడంటూ నెటిజన్లు సరదా కామెంట్స్ చేయడం విశేషం.
తన పెళ్లిళ్ల గురించి జగన్ పదేపదే విమర్శిస్తున్నారని పవన్ అనేక సందర్భాల్లో వాపోయిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల ముందు టీడీపీకి మద్దతు ఇవ్వకుండా ఇతర పార్టీలతో కలిసి పోటీ చేసిన సందర్భంలో ఆయన వ్యక్తిగత జీవితాన్ని ఎల్లో మీడియా బజారున పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు టీడీపీకి రాజకీయంగా అనుకూలంగా వుండడంతో పవన్ను విడిచి పెట్టారని, లేదంటే జగన్ కంటే ఘోరంగా బాబు టార్గెట్ చేసేవాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.