పాపం చంద్రబాబు. టీడీపీని కాపాడుకునేందుకు రాజకీయ చరమాంకంలో సర్కస్ ఫీట్లు వేస్తున్నారు. టీడీపీని కాపాడాలని వేడుకుంటూ ఆంధ్రప్రదేశ్ సమాజం నుంచి పెద్దగా స్పందన రాదని భావించి, జగన్కు, రాష్ట్రానికి ముడిపెట్టి సరికొత్త నినాదాన్ని ఎత్తుకున్నారు.
చంద్రబాబు తెలివితేటల్ని తప్పక అభినందించాలి. అయితే తనకంటే జనాలు తెలివిమీరారనే విషయం చంద్రబాబు ఇంకా పసిగట్టినట్టు లేరు. ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి వున్నాయో తెలియని అమాయకత్వంలో జనం లేరు.
ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని మండువవారిపాలెంలో శుక్రవారం మహానాడు అట్టహాసంగా ప్రారంభమైంది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభోపన్యాసం చేశారు. శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా ఆయన ప్రసం గాన్ని కొనసాగించారు. క్విట్ జగన్ – సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదం రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో మార్మోగాలని చంద్రబాబు పిలుపు నిచ్చారు.
జగన్ అధికారంలో వుంటే రాష్ట్రం బాగుపడదని చెప్పుకొచ్చారు. జగన్ దిగిపోతే తప్ప రాష్ట్రానికి మంచి రోజులు రావని చంద్రబాబు హెచ్చరించడం గమనార్హం. జగన్ మరోసారి అధికారంలోకి వస్తే టీడీపీ వుండదనే కఠిన వాస్తవం చంద్రబాబుకూ తెలుసు. అందుకే ఆయనలో ఆందోళన, భయం. జగన్ అధికారంలో వుంటే రాష్ట్రం సంగతి దేవుడెరుగు, టీడీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ బాగుపడదు.
చెట్టుకొకరు, పుట్టకొక రనే రీతిలో పార్టీ చెల్లాచెదరవుతుంది. మరోవైపు చంద్రబాబుకు వయసు పైబడడం, బలమైన ప్రత్యామ్నాయ నాయకత్వం లేకపోవడం టీడీపీకి శాపంగా మారింది. చంద్రబాబు తనయుడు లోకేశ్ సోషల్ మీడియా దాటుకుని, ప్రజలతో మమేకం కాలేకపోతున్నారు.
ఈ నేపథ్యంలో టీడీపీని కాపాడుకోవాలంటే మరోసారి అధికారంలోకి రావడం ఒక్కటే మార్గం. అందుకే చావోరేవో అన్నట్టు చంద్ర బాబు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇప్పుడు అధికారంలోకి రాకపోతే, మరెప్పటికీ రాలేమనే భయం టీడీపీని వీరోచిత పోరా టానికి ఉసిగొల్పుతోంది.