బీజేపీలోనూ, కేంద్ర ప్రభుత్వంలోనూ అమిత్షా అత్యంత శక్తిమంతమైన నాయకుడు. గతంలో ఎన్డీఏ నుంచి టీడీపీ బయటికొచ్చిన సందర్భంలో… ఇదే అమిత్షా కుటుంబంతో కలిసి తిరుమలకు రాగా, ఆయన వాహనంపై టీడీపీ రాళ్ల దాడికి దిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే అమిత్షాతో అపాయింట్మెంట్ కోసం చంద్రబాబునాయుడు చాలా కాలంగా తపిస్తున్నారు. ఎట్టకేలం ఆయనతో ఇవాళ సాయంత్రం చంద్రబాబు భేటీ కానున్నారని టీడీపీ గొప్పగా ప్రచారం చేసుకోవడం గమనార్హం.
అమిత్షాతో భేటీ వార్తలతో టీడీపీ ఏదేదో ఊహించుకుంటోంది. ఆలు లేదు, చూలు లేదు …కొడుకు పేరు సోమలింగం అనే చందంగా, అమిత్షాతో భేటీ జరగకుండానే, పొత్తు కూడా ఖరారైనట్టు ప్రచారం జరుగుతోంది. ఇక టీడీపీ అనుకూల మీడియా అయితే పొత్తులు ఖరారైనట్టు, ఎమ్మెల్యే, ఎంపీల సీట్లు ఎన్నెన్ని పంచుకోవచ్చో కూడా చెబుతోంది. కేవలం జనసేనాని పవన్కల్యాణ్తో పొత్తు పెట్టుకోవడం వల్ల లాభం లేదని టీడీపీ నిర్వహించిన పలు సర్వేల్లో వచ్చినట్టు సమాచారం. దీంతో ఎలాగైనా బీజేపీతో పొత్తు పెట్టుకుంటే తప్ప, రానున్న ఎన్నికల్లో జగన్ను ఎదుర్కోలేమనే నిర్ణయానికి చంద్రబాబు వచ్చారు.
ఈ నేపథ్యంలో ఎట్టకేలకు అమిత్ షా దయతలిచారు. చంద్రబాబుకు అపాయింట్మెంట్ ఇచ్చారు. పొత్తు ప్రతిపాదనలతో చంద్రబాబు ఢిల్లీ వెళుతున్నట్టు టీడీపీ వర్గాలు ప్రచారం చేసుకుంటున్నాయి. ఎమ్మెల్యేల సీట్లు తగ్గించి, ఎంపీల విషయంలో కాస్త ఉదారంగా వ్యవహరించేందుకు చంద్రబాబు సుముఖంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
ఈ దఫా ఏ చిన్న అవకాశాన్ని జారవిడుచుకున్నా శాశ్వతంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్న భయంతో చంద్రబాబు ఏ స్థాయికైనా దిగజారి, బీజేపీతో పొత్తు పెట్టుకోడానికి సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. దీంతో అమిత్షాతో భేటీపై సర్వత్రా ఉత్కంఠ కలిగిస్తోంది.