మళ్ళీ విశాఖకు జగన్…ఈసారి కుగ్రామానికి

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పది రోజుల తేడాలో మరో మారు ఉమ్మడి విశాఖ జిల్లాకు రానున్నారు. ఈసారి జగన్ ఏకంగా ఒక కుగ్రామానికి వెళ్ళి అక్కడ పేదలకు పట్టాలను ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతారు.…

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పది రోజుల తేడాలో మరో మారు ఉమ్మడి విశాఖ జిల్లాకు రానున్నారు. ఈసారి జగన్ ఏకంగా ఒక కుగ్రామానికి వెళ్ళి అక్కడ పేదలకు పట్టాలను ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతారు.

రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పట్టాలు ఇచ్చినా ఉమ్మడి విశాఖ జిల్లాలో కోర్టు కేసుల కారణంగా కొన్ని చోట్ల ఈ రోజుకీ పేదలకు పట్టాల పంపిణీ జరగలేదు. దాన్ని ఒక పండుగగా చేయాలన్నది వైసీపీ ఆలోచన.

ఈ క్రమంలో ముఖ్యమంత్రి పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం మండలం పైడివాడ గ్రామానికి ఈ నెల 28న రానున్నారు. ఈ సందర్భంగా ఆయన పేదలకు ఇళ్ళ పట్టాలను స్వయంగా పంపిణీ చేస్తారు. అదే విధంగా రానున్న రోజుల్లో విశాఖ జిల్లాలో కూడా దాదాపు రెండు లక్షల మంది పేదలకు ఇళ్ళ పట్టాలను పంపిణీ చేసే బృహత్తర కార్యక్రమానికి కూడా ముఖ్యమంత్రి హాజరవుతారు.

దాని కోసం కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. మొత్తానికి వరసబెట్టి ముఖ్యమంత్రి విశాఖ జిల్లా పర్యటనలు ఇక మీదట కూడా ఉంటాయని అంటున్నారు. అదే విధంగా విశాఖలో పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.