బైబై బాబు… భువ‌నేశ్వ‌రి అంటున్నారు!

పాపం భువ‌నేశ్వ‌రి. కుప్పం ప‌ర్య‌ట‌న‌లో స‌ర‌దా కోసం అంటూ ఆమె రాజ‌కీయాలు మాట్లాడారు. ఆ మాట‌లు కాస్త వివాదాస్ప‌దం అయ్యాయి. 35 ఏళ్లుగా కుప్పం నుంచి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న త‌న భ‌ర్త చంద్ర‌బాబునాయుడికి విరామం…

పాపం భువ‌నేశ్వ‌రి. కుప్పం ప‌ర్య‌ట‌న‌లో స‌ర‌దా కోసం అంటూ ఆమె రాజ‌కీయాలు మాట్లాడారు. ఆ మాట‌లు కాస్త వివాదాస్ప‌దం అయ్యాయి. 35 ఏళ్లుగా కుప్పం నుంచి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న త‌న భ‌ర్త చంద్ర‌బాబునాయుడికి విరామం ఇవ్వాల‌నే కోరిక ఇటీవ‌ల త‌న మ‌న‌సులో క‌లిగింద‌ని ఆమె అన్నారు. కుప్పం నుంచి తాను పోటీ చేయాల‌ని అనుకుంటున్న‌ట్టు న‌వ్వుతూ ఆమె చెప్పారు.

చంద్ర‌బాబు, త‌న‌లో ఎవ‌రు కావాలో చేతులెత్తాల‌ని తన పార్టీ శ్రేణుల్ని ఆమె స‌ర‌దాగా కోరారు. ఇద్ద‌రూ కావాలని టీడీపీ శ్రేణులు కోర‌డం గ‌మ‌నార్హం. అయితే ఇదంతా స‌ర‌దా కోసం చెప్పిందే అని, చంద్ర‌బాబే కుప్పం నుంచి పోటీ చేస్తార‌ని భువ‌నేశ్వ‌రి కొస‌మెరుపు మాట‌లుగా చెప్పారు. భువ‌నేశ్వ‌రి కామెంట్స్ టీడీపీకి స‌ర‌దా కావ‌చ్చు. కానీ ప్ర‌త్య‌ర్థులు అలా తీసుకోలేదు.

కుప్పంలో భువ‌నేశ్వ‌రి స‌ర‌దా కామెంట్స్‌పై ఇవాళ ఒంగోలు ప‌ర్య‌ట‌న‌లో సీఎం జ‌గ‌న్ కూడా స్పందించారు. ఆమె మాటల్ని తీసుకుని చంద్ర‌బాబుపై పంచ్‌లు విసిరారు. మ‌నం సిద్ధ‌మ‌ని అంటుంటే చంద్ర‌బాబు భార్య భువ‌నేశ్వ‌రి త‌న భ‌ర్త సిద్ధంగా లేర‌ని చెప్పిన‌ట్టు వెట‌క‌రించారు. బైబై బాబు అని భువ‌నేశ్వ‌రి అంటున్నార‌ని జ‌గ‌న్ దెప్పి పొడ‌వ‌డం విశేషం.

కీల‌క‌మైన ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌తి మాట ఎంత జాగ్ర‌త్త‌గా మాట్లాడాలో భువ‌నేశ్వ‌రికి అనుభ‌వంలోకి వ‌చ్చి వుంటుంది. స‌ర‌దా కామెంట్స్‌ను ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి వైసీపీ త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకోవ‌డంపై భువ‌నేశ్వ‌రి బాధ‌ప‌డుతూ వుండొచ్చు. మొద‌టి నుంచి కుప్పంలో ఈ ద‌ఫా చంద్ర‌బాబునాయుడు ఓట‌మి భ‌యంతో పోటీ చేయర‌నే చ‌ర్చ న‌డుస్తోంది. ఈ క్ర‌మంలో భువ‌నేశ్వ‌రి కామెంట్స్ వైసీపీ ప్ర‌చారానికి బ‌లం క‌లిగిస్తున్నాయి. అందుకే భువ‌నేశ్వ‌రి స‌ర‌దా కామెంట్స్ వైసీపీకి అస్త్రంగా మారాయి.