లండన్ పర్యటన ముగించుకుని వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్… వెంటనే ఢిల్లీ పర్యటన వుంటుందనే ప్రచారం సాగుతోంది. జగన్ ఢిల్లీకి వెళ్తున్నారంటే టీడీపీ గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్తో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇంతకాలం జగన్ ఢిల్లీ వెళ్తున్నారంటే, సొంత కేసుల గురించి ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్షాతో మాట్లాడుకునేందుకని టీడీపీ నేతలు ఎద్దేవా చేసేవారు.
ఇప్పుడు టీడీపీ నుంచి ఆ వెటకారం రావడం లేదు. కేవలం టీడీపీని మరింతగా ఇబ్బందుల్లోకి ఎలా నెట్టాలనే విషయమై చర్చించేందుకే ఢిల్లీ వెళ్తుంటాడని టీడీపీ నేతలు అనుమానిస్తున్నారు.ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లండన్ వ్యక్తిగత పర్యటన ముగిసింది. ఇవాళ ఉదయం జగన్, ఆయన భార్య భారతి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. వారికి మంత్రులు, ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు.
చంద్రబాబు అరెస్ట్ తర్వాత మూడు రోజులకు ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అడుగు పెట్టారు. దీంతో జగన్ రాక అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సీఎం జగన్ తర్వాత అడుగు ఎలా పడుతుందో అనే ఆందోళన టీడీపీలో ఉంది. ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్షా అపాయింట్మెంట్ను అడిగినట్టు సమాచారం. జగన్ ఊరికే ఢిల్లీ వెళ్లరని టీడీపీ భావిస్తోంది. మరీ ముఖ్యంగా చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ వుందని అనుమానిస్తున్న తరుణంలో జగన్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
మాజీ ముఖ్యమంత్రి చంద్రనాయుడిని మరిన్ని కేసుల్లో ఇరికించి, రాజకీయంగా చావు దెబ్బతీసేందుకే జగన్ను ఢిల్లీ పెద్దలు పిలిపించుకుంటున్నారా? అని టీడీపీ నేతలు అనుమానిస్తున్నారు. అదే జరిగితే ఇక చంద్రబాబు రాజకీయంగా బతికి బట్ట కట్టలేరనే చర్చకు తెరలేచింది. హస్తినకు జగన్ వెళ్లారంటే, ఏపీలో ప్రధాన ప్రతిపక్షానికి మూడినట్టే అనే ప్రచారానికి బలం కలిగించేలా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.