ఏపీలో బీజేపీ దయనీయ స్థితిపై ఆ పార్టీ నిజమైన కేడర్ సిగ్గుతో చచ్చిపోతోంది. ఆత్మాభిమానం, సిగ్గు, శరం లేని ఒక రోజు వస్తుందని తామెప్పుడూ వూహించలేదని బీజేపీ కార్యకర్తలు వాపోతున్నారు. జాతీయ స్థాయిలోనూ, అలాగే దేశంలో అత్యధిక రాష్ట్రాల్లో పాలన సాగిస్తున్న బీజేపీని, ఏపీలో టీడీపీ, జనసేన నడిపించడం ఏంటనే వేదనతో కూడిన ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
బీజేపీ ఆత్మాభిమానాన్ని కాపాడాల్సిన బాధ్యత నుంచి తమ అధ్యక్షురాలు పురందేశ్వరి తప్పుకున్నట్టు కనిపిస్తోందని వారు అంటున్నారు. టీడీపీ, జనసేన కూటమికి ప్రధాని మోదీ మద్దతు వుందని పవన్కల్యాణ్ కామెంట్స్ చేసినా, పురందేశ్వరి నోరు మెదపకపోవడం వెనుక ఆంతర్యం ఏంటని వారు నిలదీస్తున్నారు. మౌనంతో అంగీకారాన్ని తెలిపినట్టు కాదా? అని బీజేపీ కేడర్ నిలదీస్తోంది.
టీడీపీ, జనసేన తమ ఇష్టానుసారం పొత్తు కుదుర్చుకున్నాయని, ఇప్పుడు సమన్వయం కోసం నాదెండ్ల మనోహర్ను నియమించామని పవన్ చెప్పడాన్ని, బీజేపీ అంటే లెక్కలేని తనంగా కేడర్ చూస్తోంది. బీజేపీతో సంబంధం లేకుండా టీడీపీ పొత్తు పెట్టుకోవడమే కాకుండా, ఇంకా ఎన్డీఏలోనే వున్నానని పవన్ ప్రకటించగా, పురందేశ్వరి ఆయనకు వత్తాసు పలకడం ఏంటని నిలదీస్తున్నారు.
ఏపీలో బీజేపీకి బలం లేకపోయినా గౌరవంతో బతుకుతోందని, టీడీపీ కుట్రలో భాగంగా అది కాస్త పోతోందని కేడర్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. పవన్ వ్యాఖ్యలను తప్పుగా చూడడం లేదని పురందేశ్వరి… టీడీపీ గొంతుకతో మాట్లాడుతున్నట్టుగా వుందే తప్ప, బీజేపీ కోసం పని చేస్తున్నట్టుగా కనిపించడం లేదని మండిపడుతున్నారు. ఈ మాత్రం సంబరానికి టీడీపీలో బీజేపీని విలీనం చేస్తే సరిపోతుందని ఆ పార్టీ కార్యకర్తలు మండిపడుతున్నారు.