జనసేనాని పవన్కల్యాణ్ అంటే చంద్రబాబుకు ఊడిగం చేసే నాయకుడిగా ఆయన ప్రత్యర్థులు విమర్శిస్తుంటారు. విమర్శలకు తగ్గట్టుగానే పవన్ రాజకీయ పంథా వుంటుందనే అభిప్రాయం రోజురోజుకూ బలపడుతోంది. చంద్రబాబుకు ఊడిగం చేసే పవన్కల్యాణ్కు కేవలం భజనపరులు కావాలని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు పరోక్షంగా కోరారు. రెండు రోజుల క్రితం అనకాపల్లి జిల్లాలో పార్టీ కార్యాలయం ప్రారంభం సందర్భంగా నాగబాబు వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
పవన్ను ఎవరూ ప్రశ్నించకూడదు, సలహాలు ఇవ్వకూడదని నాగబాబు తేల్చి చెప్పారు. అలాగే పవన్కల్యాణ్ నిలబెట్టిన వారికే ఓట్లు వేయాలని ఆయన సూచించారు. ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని ప్రకటించిన పవన్కల్యాణ్, తనను మాత్రం ఎవరూ ఏమీ అనకూడదనడం విమర్శలకు దారి తీసింది.
జనసేనకు బలమైన మద్దతుదారుడైన ఓ యూట్యూబర్ ఇటీవల పవన్కు కొన్ని సూచనలు చేయడమే నాగబాబు ఆగ్రహానికి కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సదరు జనసేన హార్డ్కోర్ అభిమాని యూట్యూబ్ ద్వారా పవన్కు చేసిన హితవచనాలే నాగబాబు వార్నింగ్కు కారణమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
నాగబాబుకు కోపం తెప్పించిన ఆ మాటలేంటో తెలుసుకుందాం.
“పవన్కల్యాణ్ గారు మీరు మారాలి. ఎప్పుడూ పవన్ గురించి బహిరంగంగా విమర్శించలేదు. కానీ ఇప్పుడు రిస్క్ తీసుకుని ఆయనకు కొన్ని విషయాలు చెప్పాలని అనిపించింది. నిజం జీవితంలో, రాజకీయంలో కొంచెం నటించడం నేర్చుకోవాలి. ఈ స్టేట్మెంట్ ఇస్తున్నందుకు నన్ను తప్పుగా తీసుకోవద్దు. చంద్రబాబునాయుడు, జగన్మోహన్రెడ్డిల వెనుక ఉన్న పరిణితి చెందిన సామాజిక వర్గాలు వేరు. వైఎస్ జగన్ కోసం ఆ పార్టీ నాయకుల త్యాగంతో పోల్చితే నాతో సహా జనసేనకు ఏమీ చేయనట్టే. కానీ మీ దగ్గర ఎమ్మెల్యే టికెట్ తప్ప మరేదీ మాట్లాడం. చిరంజీవి టికెట్లు అమ్ముకున్నారంట, పవన్కల్యాణ్ రూ.200 కోట్లు తీసుకున్నారని విమర్శించే అల్ప బుద్ధి కలిగిన అత్యధికులున్న సామాజిక వర్గాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని నటిస్తే తప్ప, వారు మనతో నడవరు. నిరాడంబరంగా, పారదర్శకంగా ఉన్నానని మీరు అనుకుంటే, రాజకీయాల్లో అది వర్కౌట్ కాదు” అని శ్రేయోభిలాషిగా చెప్పారు.
ఇందులో తప్పేమీ లేదు. కానీ సదరు జనసేన అభిమానిపై పార్టీలోని కొందరు నాయకులు నెగెటివ్గా చెప్పడం వల్లే నాగబాబు ముందూవెనుకా ఆలోచించకుండా ఫైర్ అయ్యారనే చర్చకు తెరలేచింది. నాగబాబు ధోరణి జనసేనకు అభిమానుల్ని కూడా దూరం చేసేలా వుందనే చర్చ నడుస్తోంది. జనసేనానికి సూచనలు, సలహాలు ఇవ్వడం వెనుక ఉద్దేశం… పార్టీపై ప్రజల్లో అభిప్రాయాన్ని చెప్పి, తప్పుల్ని సరిదిద్దుకుని బలపరిచేందుకే అని ఆ పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు.
నాగబాబు చెప్పినట్టు చేయడం అంటే… కేవలం భజనపరులు మాత్రమే కావాలని కోరుతున్నట్టుగా ఉందని దెప్పి పొడుస్తున్నారు. చిన్న విమర్శను కూడా తట్టుకోలేకపోతే జనసేన బతికి ఎలా బట్ట కడుతుందనే ప్రశ్న కేడర్ నుంచి వస్తోంది.