హరీష్ రావు దౌర్భాగ్యపు మాటలు మానుకో!

నోరు ఉంది క‌దా అని అయిన‌దానికి కాని దానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ పై నోరు పారేసుకునే తెలంగాణ మంత్రి, కేసీఆర్ మేన‌ల్లుడు హరీశ్ రావు ఏపీలో పరిస్థితులకి, తెలంగాణలో పాలనకి జమీన్ ఆస్మాన్ ఫరక్ (భూమికి…

నోరు ఉంది క‌దా అని అయిన‌దానికి కాని దానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ పై నోరు పారేసుకునే తెలంగాణ మంత్రి, కేసీఆర్ మేన‌ల్లుడు హరీశ్ రావు ఏపీలో పరిస్థితులకి, తెలంగాణలో పాలనకి జమీన్ ఆస్మాన్ ఫరక్ (భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా) ఉందని ఆయన చేసిన వ్యాఖ్యలపై ఎట్టకేలకు ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు స్పందించారు. ఎందుకంటే తెలంగాణ ప్ర‌భుత్వంలోని మంత్రులు, నాయకులు ఏపీపై ఎన్ని మాట్లాడిన నోరు మెద‌ప‌ని అధికార పార్టీ స్పందించ‌డం వింత‌గా ఉంది.

మంత్రి హ‌రీష్ రావు ఆంధ్ర‌పై చేసిన కామెంట్స్ పై కారుమూరి మాట్లాడుతూ.. హ‌రీష్ రావు దౌర్భాగ్య‌పు మాట‌లు మాట‌లు మానుకోవాల‌ని.. అన్ని సౌక‌ర్యాల‌తో వ‌చ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా త‌గ‌లేసుకున్నారో తెలంగాణ ప్ర‌జ‌లు, ప్ర‌తిప‌క్షాలే చెబుతార‌ని.. తెలంగాణ స్కూళ్లకు, ఏపీలో బడులకు తేడాగా గమనించాలన్నారు. హైదరాబాద్‌లో రోడ్లు వేస్తే సరిపోదని… రాష్ట్రమంతా అభివృద్ధి చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తున్నామన్నారు. హరీష్‌ రావు టైం చూసుకొని ఏపీ వస్తే ఇక్కడ ఏం జరుగుతుందో చూపిస్తామన్నారు.  

కాగా నిన్న ఓ స‌భ‌లో హారీష్ రావు మాట్లాడుతూ.. ఎంతో మంది ఇతర రాష్ట్రాల వాళ్లు వచ్చి తెలంగాణలో స్థిరపడ్డారని, ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా చాలా మంది వచ్చారని..  ఏపీ నుంచి వచ్చిన వారు అప్పుడప్పుడూ సొంతూరికి వెళ్లినప్పుడు అక్కడి రోడ్లు, ఆస్పత్రుల పరిస్థితి ఏలా ఉంటుందో మీకు తెలియదా? అని అడిగారు. 

కాగా గ‌తంలో వరంగల్ ఎంజీఎంలో శ్రీనివాస్ అనే వ్య‌క్తిని ఎలుకలు కొరకడంతో తీవ్ర రక్తస్రావమై పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయిన విష‌యం తెలిసిందే. ముందు తెలంగాణ‌లోని ప్ర‌భుత్వ ఆస్ప‌త్రులు బాగుచేసి ప‌క్క రాష్ట్రాల‌పై కామెంట్స్ చేయ‌లంటున్నారు తెలంగాణలోని ప్ర‌తిప‌క్షాలు. గ‌తంలో కూడా హారీష్ రావు ఆంధ్ర‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. తాము ఏమి చేశామో చెప్ప‌కుండా ప‌దేప‌దే ఆంధ్ర పేరు ఎత్తుకోని రాజ‌కీయం చేయ‌డంలో హారీష్ రావు ముందు వ‌రుస‌లో ఉంటారు.