వైజాగ్‌లో పెళ్లి చేసుకుని, విడాకులిచ్చి!

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై తిరుప‌తి జిల్లా శ్రీ‌కాళ‌హ‌స్తి ఎమ్మెల్యే బియ్య‌పు మ‌ధుసూద‌న్‌రెడ్డి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ఉత్త‌రాంధ్ర‌లో వారాహి యాత్ర పేరుతో పర్య‌టిస్తూ త‌మ పార్టీని రెచ్చ‌గొట్టేలా మాట్లాడ్డంపై శ్రీ‌కాళ‌హ‌స్తి ఎమ్మెల్యే మండిప‌డ్డారు. ఇవాళ ఆయ‌న…

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై తిరుప‌తి జిల్లా శ్రీ‌కాళ‌హ‌స్తి ఎమ్మెల్యే బియ్య‌పు మ‌ధుసూద‌న్‌రెడ్డి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ఉత్త‌రాంధ్ర‌లో వారాహి యాత్ర పేరుతో పర్య‌టిస్తూ త‌మ పార్టీని రెచ్చ‌గొట్టేలా మాట్లాడ్డంపై శ్రీ‌కాళ‌హ‌స్తి ఎమ్మెల్యే మండిప‌డ్డారు. ఇవాళ ఆయ‌న ఒక చాన‌ల్‌తో మాట్లాడుతూ ప‌వ‌న్‌కు రాజ‌కీయ ప‌రిజ్ఞానం, హుందాత‌నం లేవ‌న్నారు. విశాఖ‌లో ప‌వ‌న్ ఆరోపిస్తున్న కొండ‌ల‌పై ఒక్క ప్ర‌భుత్వ భ‌వ‌నాల నిర్మాణాలు మాత్ర‌మే క‌నిపిస్తున్నాయ‌న్నారు.

ఆ కొండ‌పై ఒక వైపు రామానాయుడు స్టూడియో, మ‌రోవైపు అపార్ట్‌మెంట్లు, కాలేజీలున్నాయ‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఇవేవీ కాద‌ని కేవ‌లం ప్ర‌భుత్వ భ‌వ‌నాలు క‌డితేనే ఏమో అవుతుంద‌న్న‌ట్టు ప‌వ‌న్ ఓవ‌రాక్ష‌న్ చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. ప‌వ‌న్ మొద‌టి పెళ్లి చేసుకుంది వైజాగ్‌లోనే అని ఆయ‌న గుర్తు చేశారు. వైజాగ్ మ‌హిళ‌కు విడాకులిచ్చాడ‌ని త‌ప్పు ప‌ట్టారు.

త‌ద్వారా వైజాగ్ ప్ర‌జ‌ల్ని మోస‌గించాడ‌ని, అక్క‌డికి వెళ్లి ప‌వ‌న్ ఏం చేస్తాడ‌ని వైసీపీ ఎమ్మెల్యే ప్ర‌శ్నించారు. ఐదారు త‌ర‌గ‌తుల పిల్ల‌ల‌కు పెళ్లి చేస్తే ఎట్లా వుంటుందో, ప‌వ‌న్‌కు రాజ‌కీయం అలా వుంద‌న్నారు. ప‌వ‌న్ ఏం మాట్లాడ్తారో ఆయ‌న‌కే తెలియద‌న్నారు. కొండ చుట్టూ చంద్ర‌బాబు, ఆయ‌న బంధువుల‌కు సంబంధించి వంద‌లాది ఆస్తులున్నాయ‌న్నారు. వాటి గురించి మొద‌ట మాట్లాడాల‌ని డిమాండ్ చేశారు.  

ప్ర‌భుత్వ భూముల్లో అక్ర‌మ నిర్మాణాల గురించి చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్ అడ‌గ‌ర‌న్నారు. ప‌వ‌న్‌, ఆయ‌న కుటుంబం హైద‌రాబాద్‌లో కొండ‌మీద కాకుండా, కొండ కింద ఉన్నారా? అని బియ్య‌పు మ‌ధుసూద‌న్‌రెడ్డి నిల‌దీశారు. హైద‌రాబాద్‌లో కొండ‌మీద క‌ట్టుకున్న ఇంటిని ప‌వ‌న్ ఖాళీ చేయాల‌ని డిమాండ్ చేశారు. ప‌వ‌న్‌కు ఆలోచ‌న‌లు, ఆశ‌యాలు లేవ‌ని బియ్య‌పు మ‌ధుసూద‌న్‌రెడ్డి విమ‌ర్శించారు.