పల్నాడులో దారుణం.. 16 ముక్కలు చేసి దగ్దం

ఢిల్లీలో జరిగిన శ్రద్ధావాకర్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ కేసులో నిందితుడు ఆఫ్తాబ్, తన ప్రేయసి మృతదేహాన్ని 35 ముక్కలు చేశాడు. సరిగ్గా ఇలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్ లో…

ఢిల్లీలో జరిగిన శ్రద్ధావాకర్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ కేసులో నిందితుడు ఆఫ్తాబ్, తన ప్రేయసి మృతదేహాన్ని 35 ముక్కలు చేశాడు. సరిగ్గా ఇలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఓ వ్యక్తిని 16 ముక్కలుగా ఖండించి, వాటిని దగ్దం చేసిన ఘటన వెలుగుచూసింది.

ఈ దారుణ ఘటన పల్నాడు జిల్లా దాచేపల్లిలో జరిగింది. సైదులు, కోటేశ్వరరావు స్థానిక నగర పంచాయతీలో కాంట్రాక్ట్ ప్లంబర్లుగా పనిచేస్తున్నారు. విధుల్లో భాగంగా బైపాస్ కు వెళ్లాడు కోటేశ్వరరావు. అక్కడే కాపుకాసిన సైదులు, అతడి కొడుకు కోటేశ్వరరావును ఇనప రాడ్డుకో కొట్టి హత్య చేశారు.

అనంతరం కోటేశ్వరావు మృతదేహాన్ని తన పొలంలోకి తీసుకెళ్లాడు సైదులు. అక్కడ అతడి శరీరాన్ని తండ్రికొడుకులిద్దరూ 16 ముక్కలు చేశారు. తర్వాత వాటిపై పెట్రోలు పోసి తగలబెట్టారు.

చీకటిపడినా కోటేశ్వరావు ఇంటికిరాకపోవడంతో కుటుంబసభ్యులు వెదకడం ప్రారంభించారు. సైదులు పొలంలో మంటలు కనిపించడంతో అనుమానంతో అక్కడికి వెళ్లి చూడగా కాలుతున్న పాదాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, సైదులు ఇంటికి వెళ్లారు. అప్పటికే సైదులు, అతడి కొడుకు దుస్తులు మార్చుకొని పరారీకి సిద్ధమౌతున్నారు. హత్య చేసినప్పుడు వేసుకున్న దుస్తుల్ని సైదులు భార్య మంటపెడుతూ కాలుస్తూ కనిపించింది. వెంటనే ముగ్గుర్నీ అదుపులోకి తీసుకున్నారు.

కోటేశ్వరావును ఇంత కర్కశంగా హత్య చేయాల్సిన అవసరం సైదులకు ఎందుకొచ్చిందనేది పోలీసులకు అంతుచిక్కడం లేదు. కోటేశ్వరావు కుటుంబ సభ్యులు దీనిపై నోరుమెదపడం లేదు. వివాహేతర సంబంధం కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.