సొంత పార్టీని ఇరకాటంలో నెట్టేసేందుకు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు నిర్ణయించుకున్నారా? అంటే ఔననే సమాధానం వస్తోంది. ఆయనకు బుర్ర మీసాలే తప్ప, బుర్ర లేదేమో అని బీజేపీ నేతల అంతర్గత చర్చల్లో ఆగ్రహం ప్రదర్శిస్తున్నారు. ఇటీవల కాలంలో విష్ణుకుమార్ రాజు తరచూ బీజేపీకి వ్యతిరేకంగా నర్మగర్భ వ్యాఖ్యలు చేయడంపై ఆ పార్టీ సీరియస్గా వుంది.
తాజాగా మరోసారి బీజేపీని ఇబ్బందుల్లో నెట్టేసేలా విష్ణుకుమార్రాజు సీబీఐ, ఎన్ఐఏలను తెరపైకి తెచ్చారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. విష్ణుకుమార్ రాజు మీడియాతో మాట్లాడుతూ విశాఖపట్నం వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యుల అపహరణ వ్యవహారంలో భారీ కుట్ర దాగి వుందని ఆరోపించారు. ఈ కేసును సీబీఐ, ఎన్ఐఏ దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు.
సీబీఐ, ఎన్ఐఏ దర్యాప్తు సంస్థలు తమ ఏలుబడిలోని కేంద్ర ప్రభుత్వ సంస్థల చెప్పు చేతల్లో ఉన్నాయనే కనీస స్పృహ విష్ణుకుమార్ రాజుకు లేదా? అని సొంత పార్టీ నేతలు నిలదీస్తున్నారు. సీబీఐ, ఎన్ఐఏలతో దర్యాప్తు చేయించాలని విష్ణుకుమార్ రాజు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారా? అని వారు ప్రశ్నిస్తున్నారు.
బీజేపీలో వుంటూ ప్రత్యర్థులకు రాజకీయ ప్రయోజనం కలిగించేలా విష్ణుకుమార్ రాజు మాట్లాడుతుండడంపై ఆ పార్టీ సీనియర్ నాయకులు ఆగ్రహంగా వున్నారు. బీజేపీలో ఉండడం ఇష్టం లేకపోతే, తనకిష్టమైన పార్టీని చూసుకోవాలే తప్ప, తిన్నింటి వాసాలను లెక్కపెట్టడం సరైంది కాదని వారు హితవు చెబుతున్నారు.