రాజకీయం …సేద్యం …మళ్ళీ రాజకీయం ..?

ఆయన ఒకప్పుడు ఐపీఎస్ అధికారి. మామూలు పోలీసు అధికారైతే చెప్పుకోవాల్సిన అవసరమేలేదు. కానీ ఆయన పనిచేసింది ఎంతటివారికైనా ముచ్చెమటలు పట్టించే కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) లో. అదీ జాయింట్ డైరెక్టర్ గా. ఏపీ…

ఆయన ఒకప్పుడు ఐపీఎస్ అధికారి. మామూలు పోలీసు అధికారైతే చెప్పుకోవాల్సిన అవసరమేలేదు. కానీ ఆయన పనిచేసింది ఎంతటివారికైనా ముచ్చెమటలు పట్టించే కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) లో. అదీ జాయింట్ డైరెక్టర్ గా. ఏపీ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో కీలక దర్యాప్తు జరిపింది ఈయనే. విచారణకు ముందే ఏడాదికి పైగా జగన్ జైలులో గడపడానికి కారణం ఈయనే. ఇంతకూ ఆయనెవరో ఈపాటికి అర్ధమై ఉంటుంది. ఆయనే జేడీ లక్ష్మీనారాయణ. ఆయన నిర్వహించిన పదవి పేరే ఆయన ఇంటి పేరుగా మారిపోయింది. సరే …ఆయన యేవో కారణాలవల్ల వీ ఆర్ ఎస్ తీసుకొని సమాజసేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చారు. కానీ రాజకీయాల్లో ఇమడలేక వ్యవసాయ రంగంలోకి దిగారు. మళ్ళీ ఇప్పుడు రాజకీయాలవైపు చూస్తున్నారట.

2019 ఎన్నికలకు రెండేళ్ల ముందే ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టారు. ప్రజా సమస్యలపై పోరాడారు. గత ఎన్నికల సమయంలో అనూహ్యంగా జనసేనలో చేరి విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి పోటీచేశారు. కేవలం 15 రోజుల పాటు ప్రచార పర్వంలో పాల్గొని దాదాపు 2.85 లక్షల ఓట్లు సాధించుకున్నారు. యూత్ లో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఆయన గణనీయమైన ఓట్లు పొందగలిగారు. నిజాయితీ గల అధికారిగా పనిచేసిన పేరు ఉంది. మంచి వాగ్ధాటి ఉన్న వ్యక్తి. అటు విద్యార్థులు, యువతరం ఆయన స్పీచ్ లతో స్ఫూర్తిని పొందారు. విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.

అందుకే నాడు పక్షం రోజుల పాటు ఎన్నికల ప్రచారం చేసినా గౌరవప్రదమైన ఓట్లు ఆయన దక్కించుకున్నారు. అటు తరువాత కొన్ని కారణాలవల్ల జనసేన పార్టీకి కూడా రాజీనామా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తూ సామాజిక కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. కొంత కాలంగా కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలోని ధర్మవరం, రాచపల్లి గ్రామ పరిధిలో ఉన్న పన్నెండు ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో ప్రకృతి (సేంద్రియ) వ్యవసాయం చేస్తున్నారు. ఈ వ్యవసాయ క్షేత్రాన్ని లక్ష్మీనారాయణ కౌలుకు తీసుకున్ని సాగు చేస్తుండగా పూర్తిగా సేంద్రీయ పద్దతిలో మాత్రమే పంటలు పండిస్తున్నారు. ఇప్పుడు మళ్లీ రాజకీయాల పట్ల ఆసక్తి చూపిస్తున్నారు.

ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. వాస్తవానికి సీబీఐకి స్వచ్ఛంద పదవీవిరమణ చేసినప్పుడే ఆయన రాజకీయ పార్టీ పెడతారని అంతా భావించారు. కానీ అప్పటికే జయప్రకాష్ నారాయణ వంటి వారు పార్టీ స్థాపించి నడిపించలేకపోయారు. అందుకే తన భావాలకు దగ్గరగా ఉన్న పార్టీగా జనసేనను ఎంచుకున్నారు. జనసేన నుంచి పోటీచేసిన ఆయనకు విశాఖ ప్రజలు పట్టం కడతారని అంతా భావించారు. కానీ ఆయనకు ఓటమి తప్పలేదు. అటు తరువాత రాజకీయాలంటే ఇష్టం లేదన్నట్టు ఆయన దూరంగా జరిగిపోయారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో మరోసారి బరిలో దిగాలని ప్రయత్నిస్తున్నారు. ఇందుకు సరైన పార్టీ కోసం అన్వేషిస్తున్నారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఆయన జనసేనలో మాత్రం చేరే పరిస్థితులు అయితే కనిపించడం లేదు

గత ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి బరిలో దిగి ఓటమి తరువాత రాజీనామా చేశారు. ఇప్పుడదే పార్టీలోకి వెళితే తప్పుడు సంకేతాలువెళతాయని భావిస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ కు వ్యతిరేకంగా విధులు నిర్వహించినందున ఆ పార్టీలో చేరే ఛాన్స్ లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ముందున్న ఆప్షన్ టీడీపీ, బీజేపీ, ఆప్. టీడీపీ బలమైన ప్రాంతీయ పార్టీగా ఉంది.పైగా అక్కడ ఇప్పటికే సీనియర్ నాయకత్వం ఉంది. అక్కడ తాను కోరుకునే స్వేచ్ఛ., గౌరవం లభించే చాన్స్ లేదు. అందుకే అటు వైపుగా వెళ్లే అవకాశంలేదు. అమ్ ఆద్మీ పార్టీని దక్షిణాది రాష్ట్రాలకు విస్తరించే ఉద్దేశంలో కేజ్రీవాల్ ఉన్నారు. ఇప్పటికే జేడీ లక్ష్మీనారాయణకు టచ్ లోకి వచ్చారని.. ఏపీ బాధ్యతలు చూసుకోవాలని సూచించారని టాక్ నడుస్తోంది.

అయితే అంత బలం లేకపోవడంతో జేడీ పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితిలో జేడీ లక్ష్మీనారాయణ బీజేపీయే కరెక్ట్ అని భావిస్తున్నట్టు సన్నిహితులు చెబుతున్నారు. బీజేపీలో చేరి విశాఖ ఎంపీగా పోటీచేస్తే బాగుంటుందన్న అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. గతంలో ఇక్కడ నుంచి ఎంపీగా హరిబాబు గెలుపొందారు. అప్పట్లో అది పొత్తుతో సాధ్యమైంది. కానీ ఈ సారి కూడా టీడీపీ, జనసేనతో బీజేపీకి పొత్తు కుదిరే అవకాశముంది. దీంతో బీజేపీలో చేరితే తానే అభ్యర్థి అయ్యే చాన్స్ ఉందని లక్ష్మీనారాయణ భావిస్తున్నారట. తొందరలోనే దీనిపై ప్రకటన చేస్తారని అంటున్నారు. చూడాలి ఏమౌతుందో.