విశాఖలో సర్వం సిద్ధం చేసుకుంటున్న పురందేశ్వరి!

విశాఖ ఎంపీ అభ్యర్ధిగా బీజేపీ తరఫున పోటీ చేయడానికి ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ దగ్గుబాటి పురందేశ్వరి సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. విశాఖలో బీజేపీ ఎంపీ ఆఫీసుని ఆమె ఫిబ్రవరి ఒకటవ తేదీన శుభ ముహూర్తం…

విశాఖ ఎంపీ అభ్యర్ధిగా బీజేపీ తరఫున పోటీ చేయడానికి ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ దగ్గుబాటి పురందేశ్వరి సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. విశాఖలో బీజేపీ ఎంపీ ఆఫీసుని ఆమె ఫిబ్రవరి ఒకటవ తేదీన శుభ ముహూర్తం చూసుకుని ప్రారంభిస్తున్నారు.

ఇది లాంచనమే అని అంటున్నారు. ఆమెకు కేంద్ర బీజేపీ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే ఆమె ఎంపీ ఆఫీసుని ప్రారంభించుకుంటున్నారు అని అంటున్నారు. ఆమె 2009, 2019 తరువాత విశాఖ నుంచి ముచ్చటగా మూడోసారి పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

ఈసారి టీడీపీ జనసేన పొత్తు ఉంటుందని నమ్మకంగా బీజేపీ నేతలు ఉన్నారు. ఆ పొత్తుతో మరోసారి విశాఖ ఎంపీగా గెలిచి కేంద్రంలో మంత్రి కావాలని ఆమె ఆశ పడుతున్నారు అని అంటున్నారు. 2019లో ఏ పొత్తులూ లేకుండా ఆమె బీజేపీ నుంచి పోటీ చేస్తే డిపాజిట్లు రాలేదు. ఈసారి మాత్రం తానే విజేతను అని ఆమె భావిస్తున్నారు.

ఇలా అన్ని లెక్కలు సరిచూసుకునే ఆమె విశాఖకు తరలి వస్తున్నారు అని అంటున్నారు. విశాఖలో బీజేపీ తరఫున ఎంపీ అభ్యర్ధిగా ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తున్న రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుకు ఇది ఒక విధంగా షాకింగ్ పరిణామం అని అంటున్నారు.

ఆయన సంక్రాంతి సంబరాలు అని గణతంత్ర వేడుకలు అని చాలా కార్యక్రమాలు విశాఖ నుంచి చేపడుతున్నారు. ఆయనకే ఎంపీ టికెట్ అని అంతా అనుకుంటున్న నేపధ్యంలో పురందేశ్వరి పిలుపు మేరకు విశాఖలో ఎంపీ ఆఫీసు ఓపెనింగ్ అని అంటున్నారు. ఆమె విశాఖ ఎంపీగా పోటీ చేయడానికే ఇదంతా అని అంటున్నారు.