ఆలయ కమిటీలు వేయకపోవడంపై అసలు రీజన్ ఇదే!

ప్రధానంగా గుడులనుంచి దండుకుంటున్న వాటాల్లో కోతపడకుండా ఉండేందుకు బోర్డులు ఏర్పాటుకాకుండా అడ్డుకుంటున్నట్టుంది.

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో మరో విడత నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో పది జిల్లాలకు సహకార బ్యాంకు (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్ సంఘాలు (డీసీఎంఎస్) ఛైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మొత్తం పది జిల్లాలకు భర్తీ చేయగా.. రెండు రకాల పదవుల్లోనూ తొమ్మిదేసి స్థానాలకు తెలుగుదేశం నాయకులను, ఒక్కొక్క స్థానానికి జనసేన వారిని నియమించారు.

మొత్తం ఈ ఇరవై నామినేటెడ్ పోస్టుల భర్తీలో భారతీయ జనతా పార్టీకి అవకాశం దక్కలేదు. ఈ పదవులన్నీ భర్తీ చేస్తున్నారు గానీ.. రాష్ట్రంలో వివిధ పార్టీల నాయకులు ఎంతో కీలకమైనవిగా భావించే ఆలయ పాలకమండలుల నియామకం మాత్రం జరగడం లేదు. సర్కారు వాటి విషయంలో కాలయాపన చేస్తూనే వస్తోంది. అయితే విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. అనేక ప్రధాన ఆలయాలకు పాలకమండళ్ల నియామకం జరగకపోవడం వెనుక.. ఆయ ప్రాంతాల ఎమ్మెల్యేలే ఉన్నట్టుగా తెలుస్తోంది.

చంద్రబాబునాయుడు ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత.. సుదీర్ఘకాలం కసరత్తు చేసి తిరుమల తిరుపతి దేవస్థానాలకు మాత్రం పాలకమండలిని నియమించారు. నిజానికి టీవీ5 సంస్థ ఛైర్మన్ గా తెలుగుదేశం గెలవడానికి బిఆర్ నాయుడు చేసిన సేవలకు గుర్తింపుగా ఆయన టీటీడీ ఛైర్మన్ పదవి కట్టబెడతారని.. కూటమి సర్కారు ఏర్పడిన తొలినాటి నుంచి ప్రచారం జరుగుతూనే వచ్చింది. కానీ అధికారిక ప్రకటన రావడానికి కొన్ని నెలల కాలయాపన చేశారు. ఆ తరువాత మరే ఇతర ఆలయాల పాలకమండలులు ఏర్పాటు కాలేదు.

ఈ పదవులను స్థానికంగా నాయకులు చాలా కీలకంగా భావించే నేపథ్యంలో ఆశావహులు బోలెడు ఆశలు పెంచుకుంటూనే ఉన్నారు. త్వరలోనే ఆలయ పాలకమండలుల భర్తీ అనే మాటలను అటు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గానీ, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గానీ కొన్ని నెలలుగా చెబుతూనే ఉన్నారు.

రాష్ట్రంలో అనేక ప్రముఖ శివాలయాలు ఉన్న నేపథ్యంలో శివరాత్రికి ముందుగా ఆ పాలకమండలుల భర్తీ జరుగుతుందని అంతా అనుకున్నారు. కానీ.. జరగలేదు. అన్ని రకాల పోస్టులు భర్తీ చేస్తున్నారు గానీ.. దాదాపు 175 చిన్నా పెద్దా ఆలయాలు ఉండగా వాటి బోర్డులు మాత్రం వేయడంలేదు.

ఆలయ బోర్డుల నియామకానికి ప్రధానంగా స్థానిక ఎమ్మెల్యేలే అడ్డుపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఆలయాల్లో పెత్తనం అనేక మంది ఎమ్మెల్యేలకు కాసుల పంట కురిపిస్తోంది. వారి వారి ఇమేజిని పెంచుకోవడానికి కూడా ఒక అడ్డదారిగా ఉపయోగపడుతోంది. తమ పరిధిలో ఉండే ఆలయాలనుంచి రోజు వారీ లక్షల్లో వసూళ్లకు వాటాల టార్గెట్ లు నిర్ణయించి దండుకుంటున్న ఎమ్మెల్యేలు కూడా దెలుగుదేశంలోనే ఉన్నారు.

ఆలయానికి ధర్మకర్తల మండలి ఏర్పాటు అయితే.. వసూళ్లను బోర్డు ఛైర్మన్లతో కలిసి పంచుకోవాల్సి వస్తుందని, రాబడి తగ్గిపోతుందని వారు భయపడుతున్నట్టుగా సమాచారం. పైగా ఆలయ బోర్డు పదవులు ఇమేజికి సంబంధించినవి కావడంతో.. ఆయా ఆలయాల్లో తమకు పోటీగా మారో అధికారకేంద్రం ఏర్పడకుండా వీలైనంత వెనక్కు నెట్టాలని చూస్తున్నట్టుగా కూడా.. అనుకుంటున్నారు.

ప్రధానంగా గుడులనుంచి దండుకుంటున్న వాటాల్లో కోతపడకుండా ఉండేందుకు బోర్డులు ఏర్పాటుకాకుండా అడ్డుకుంటున్నట్టుంది. అయితే చంద్రబాబునాయుడు పార్టీకోసం కష్టపడిన వారికి న్యాయం చేయకుండా.. ఇలా బోర్డులు వేయకుండా ఎంతకాలం సాగదీస్తారు.. అనే అనుమానాలు అనేక మందిలో కలుగుతున్నాయి.

One Reply to “ఆలయ కమిటీలు వేయకపోవడంపై అసలు రీజన్ ఇదే!”

  1. మా అన్నయ్య ను నేర్చుకోవాలి అంటున్న వెంకట రెడ్డి గారు 

Comments are closed.