ఎన్నారై తమ్ముడికి పదవి… టికెట్ కూడానా…?

విజయనగరం జిల్లా ఎస్ కోటలో టికెట్ కోసం టీడీపీలో పెద్ద ఎత్తున పోటీ జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే కోళ్ళ లలిత కుమారి వర్సెస్ ఎన్నారై గొంప క్రిష్ణగా టీడీపీలో కొంతకాలంగా రాజకీయ సమరం సాగుతోంది.…

విజయనగరం జిల్లా ఎస్ కోటలో టికెట్ కోసం టీడీపీలో పెద్ద ఎత్తున పోటీ జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే కోళ్ళ లలిత కుమారి వర్సెస్ ఎన్నారై గొంప క్రిష్ణగా టీడీపీలో కొంతకాలంగా రాజకీయ సమరం సాగుతోంది. ఆర్ధికంగా బలంతో పాటు అంగబలాన్ని చూపిస్తూ దూసుకుపోతున్న గొంప క్రిష్ణ తనకే టికెట్ అని నమ్మకంగా ఉన్నారు. కోళ్ళ లలితకుమారి సైతం తనకే ఈసారి చాన్స్ అని చెప్పుకుంటున్నారు.

ఈ పరిణామాల నేపధ్యంలో అధినాయకత్వం ఇద్దరినీ ముందుకు నడిపిస్తూ వస్తోంది. ఎవరికీ హామీ అయితే స్పష్టంగా ఇవ్వడంలేదు. లేటెస్ట్ గా చోటు చేసుకున్న పరిణామం చూస్తే గొంప క్రిష్ణకు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పదవిని కట్టబెడుతూ హై కమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది.

దాంతో ఆయన వర్గంలో ఆనందం వెల్లి విరుస్తోంది. వచ్చే ఎన్నికల్లో తన నాయకుడుకే టికెట్ అని సంబరాలు చేసుకుంటున్నారు. ఈసారి కొత్త ముఖాలకు యువతకు చాన్స్ ఇస్తామని అధినాయకత్వం పదే పదే చెబుతున్న క్రమంలో గొంప క్రిష్ణకు అవకాశాలు ఉంటాయని అంటున్నారు.

గొంప క్రిష్ణ వర్గం ఎమ్మెల్యే టికెట్ రేసులో ముందుకు వచ్చినట్లుగా చెబుతున్నారు. కోళ్ళ ఫ్యామిలీ దీని మీద స్పందించే తీరుని బట్టి ఎస్ కోటలో సైకిల్ ప్రయాణం ఆధారపడి ఉంది.