టీటీడీ నూతన పాలక మండలి ఏర్పాటుపై సీఎం వైఎస్ జగన్ తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా పలువురి పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే టీటీడీ చైర్మన్గా భూమన కరుణాకరరెడ్డిని నియమించిన సంగతి తెలిసిందే. కొత్త పాలక మండలి కూర్పునకు సంబంధించి డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్కుమార్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈయనకు టీటీడీ పాలక మండలిలో చోటు కల్పించేందుకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు విశ్వసనీయ సమాచారం.
నిజానికి పొన్నాడ సతీష్కు మంత్రి పదవి వస్తుందనే ప్రచారం జరిగింది. అయితే చివరి నిమిషంలో ఆయనకు ఇవ్వలేకపోయామనే ఆవేదన సీఎం జగన్లో ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కోనసీమ జిల్లాకు డాక్టర్ అంబేద్కర్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ కొందరు ఆందోళనకారులు అమలాపురంలో మంత్రి విశ్వరూప్తో పాటు ఎమ్మెల్యే పొన్నాడ ఇంటిని కూడా తగలబెట్టిన సంగతి తెలిసిందే.
ఆ రోజు పొన్నాడతో పాటు ఆయన కుటుంబ సభ్యులు సజీవ దహనం నుంచి తప్పించుకున్నారు. పొన్నాడ ఇంటి గ్రౌండ్ ప్లోర్లో నిప్పు పెట్టగా, ఇంటి పై అంతస్తులో ఆయన కుటుంబ సభ్యులున్నారు. డీఎస్పీ మాధవరెడ్డి గాల్లోకి కాల్పులు జరిపి, పొన్నాడ కుటుంబ సభ్యుల్ని రక్షించారు. అప్పటి నుంచి పొన్నాడకు ఏదో ఒక పదవి ఇవ్వాలనే ఆలోచనలో జగన్ ఉన్నారు. ఆ సమయం ఇప్పుడు ఆసన్నమైంది.
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి సేవాభాగ్యం పొన్నాడకు కల్పించనున్నట్టు తెలిసింది.