వామపక్షాలపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఓ రేంజ్లో చాకిరేవు పెడుతున్నారు. సీపీఐ, సీపీఎం నాయకులు పోరాట పంథాను వదిలి, బూర్జువా పార్టీల ప్రాపకం కోసం సిద్ధాంతాల్ని, నైతిక విలువల్ని వదిలేశారు. బూర్జువా పార్టీలన్నీ అవినీతి పార్టీలుగా తిట్టిపోయడం, మళ్లీ ఆ పార్టీలతో పొత్తుల కోసం వెంపర్లాడేది వామపక్షాల నేతలే. సీపీఎం దుమ్మైతే, సీపీఐ మన్ను. ఇంతకు మించి తేడా ఏమీ లేదు.
చంద్రబాబును ప్రపంచ బ్యాంక్ జీతగాడిగా అభివర్ణించిన కమ్యూనిస్టు నేతలే, ఎన్నికల్లో కనీసం ఒకట్రెండు సీట్లైనా ఇవ్వకపోతారా? అని కాళ్లావేళ్లా పడుతున్నారు. సరిగ్గా ఐదు నిమిషాలు నిలకడగా మాట్లాడితే పవన్తో పొత్తు పెట్టుకో అని రామకృష్ణకు సలహా ఇచ్చానని గతంలో నారాయణ చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పవన్లో ఎలాంటి నిలకడ కనిపించిందో తెలియదు కానీ, టీడీపీ, జనసేన కూటమితో కలిసి పని చేస్తామని రామకృష్ణ చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో వామపక్షాలపై కమ్యూనిస్టు సానుభూతిపరుడు, సీనియర్ జర్నలిస్టు రాఘవశర్మ చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ కామెంట్ ఏంటో చూద్దాం.
“చంద్రబాబులో కారల్ మార్క్స్ కనిపిస్తాడు.. పవన్ కల్యాణ్లో చేగువెరా కనిపిస్తాడు, కాంగ్రెస్లో గాంధీజీ కనిపిస్తాడు.. కామ్రేడ్లు ఎవరినీ ఒదులుకోరు, ప్రజలను తప్ప ఇదొక విషాద భారతం” అని రాఘవశర్మ వామపక్షాలకు చురకలంటించారు.
ఈ కామెంట్ వామపక్షాల అవకాశవాద రాజకీయాల్ని ప్రతిబింబిస్తోందని కమ్యూనిజం సానుభూతి పరులు అంటున్నారు. పోరాట పంథాని విడిచి బూర్జువా పార్టీల కొమ్ము కాస్తుండడం వల్లే నేడు కమ్యూనిస్టు పార్టీలు ప్రజాదరణ కోల్పోయాయనే విమర్శ వెల్లువెత్తుతోంది. తెలంగాణలో బీఆర్ఎస్తో అంటకాగినందుకు… చివరికి కేసీఆర్ ఏం చేశారో అందరికీ తెలిసిందే అని పలువురు గుర్తు చేస్తున్నారు. ఏపీలో వామపక్ష పార్టీలు ఇంకా ప్రధాన ప్రతిపక్ష పార్టీల ఛీత్కారానికి గురైతే తప్ప, మేల్కొనేలా లేవు.