బీజేపీ – జనసేన మధ్య పొత్తు ఉన్నట్టా? లేనట్టా? అని ఎవరూ అడగకూడదు. అలాగే ఆ పార్టీల నేతలు సమాధానం చెప్పకూడదు. ఎందుకంటే ఆ రెండు పార్టీల మధ్య పొత్తు ఎండమావుల్ని తలపిస్తోంది.
అధికారికంగా ఆ రెండు పార్టీల మధ్య పొత్తు వుంది. కానీ కలిసి ఏ కార్యక్రమం చేయరు. జనసేనాని పవన్కల్యాణ్ మాత్రం బీజేపీతో పొత్తులో వుంటూ, టీడీపీతో చెట్టపట్టాలేసుకుని తిరుగుతుంటారు. ఆయన అంతే అని బీజేపీ నేతలు సరిపెట్టుకుంటున్నారు.
అయితే పవన్ వైఖరిపై బీజేపీలోని టీడీపీ వీరాభిమాన నాయకులు తెగ సంతోష పడుతున్నారు. తాజాగా పొత్తులపై బీజేపీ సీనియర్ నేత సుజనాచౌదరి మీడియాతో తన అభిప్రాయాల్ని పంచుకున్నారు. పొత్తులపై తమ అధిష్టానంతో పవన్ చర్చలు జరిపారన్నారు. బీజేపీ -జనసేన పొత్తుతోనే ముందుకు సాగుతున్నాయని అన్నారు. పొత్తులపై తమ అధిష్టానం ఏం చెబితే అలా తాము ముందుకు వెళ్తామన్నారు.
అయితే బీజేపీతో పవన్ పొత్తుల సారాంశాన్ని మాత్రం ఆయన చెప్పలేదు. ఎందుకంటే టీడీపీతో పొత్తు కుదుర్చుకోవాలని ఏపీ బీజేపీలోని ఆ పార్టీ అనుకూల నేతలు పవన్ రాగాన్ని ఆలపిస్తున్నారు. మొదటి నుంచి బీజేపీలో ఉన్న నేతలు మాత్రం టీడీపీతో పొత్తు వద్దే వద్దని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పొత్తులపై ఏపీలోని ప్రతిపక్ష పార్టీలు కిందామీదా పడుతున్నాయి.
పొత్తులుంటే తప్ప తమకు మనుగడ వుండదని భావించే వాళ్లు మాత్రం అధిష్టానాన్ని ఒప్పించే పనిలో నిమగ్నం అయ్యారు. కానీ చంద్రబాబు నమ్మదగిన నాయకుడు కాదని, ఆయనతో కలిసి పొత్తు పెట్టుకుంటే అసలుకే పార్టీ దెబ్బతింటుందనే ఆందోళనను మరికొందరు వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా వుండగా తెలంగాణలో సుజనాచౌదరి మెడికల్ కాలేజీ గుర్తింపు రద్దు చేశారనే వార్తలపై ఆయన స్పందించారు. గుర్తింపు రద్దయిన మెడికల్ కాలేజీ డైరెక్టర్గా 2014లోనే తాను తప్పుకున్నట్టు వివరణ ఇవ్వడం గమనార్హం. ఆ మెడికల్ కాలేజీ పాలనా వ్యవహారాల్లో తనకు సంబంధం లేదని అన్నారు. ప్రమాణాలను పెంచే క్రమంలో, నిబంధనలను సరిగ్గా పాటించని కాలేజీల అనుమతులను రద్దు చేయడం మంచిదేనని ఆయన చెప్పడం విశేషం.