ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ మండిపడ్డారు. ఇవాళ ఆయన రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం వినియోగించుకోవాలని ఉండవల్లి కోరారు. అయితే సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబునాయుడు బీజేపీకి పూర్తిగా సరెండ్ అయ్యారని ఘాటు విమర్శ చేశారు. కనీసం ఎన్నికల ముందైనా ఏపీకి జరిగిన అన్యాయంపై అవిశ్వాస తీర్మానంలో భాగంగా జరిగే చర్చలో మాట్లాడాలని ఆయన సూచించారు.
రాష్ట్ర విభజనపై సీడబ్ల్యూసీ తీర్మానం చేసి నేటికి పదేళ్ళు పూర్తయిందని గుర్తు చేశారు. ఏపీ విభజన జరిగి పదేళ్లు గడిచినా విభజన హామీలు ఇప్పటి వరకు అమలుకావటం లేదని తప్పు పట్టారు. టీడీపీ , వైసీపీలు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని ఆరోపించారు. అవిశ్వాస తీర్మానంలో ఏపీ ఎంపీలు గట్టిగా మాట్లాడాలని కోరారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏపీ ఎంపీలు అవిశ్వాసం పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. వైసీపీ ఎంపీలు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావటం లేదన్నారు. అవిశ్వాసంలో మాట్లాడమని ఎందుకు అంటున్నారని ఆయన నిలదీశారు.
రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తోందని తెలిసినా, ఎందుకు నిలదీయలేకున్నారని ఆయన ప్రశ్నించారు. కేంద్రం చెప్పినట్టు వింటే ఇష్టానురీతిలో నిధులు విడుదల చేస్తున్నారన్నారు. ఏపీకి రావాల్సిన రెవెన్యూ డెఫిషిట్ రూ.4,117 కోట్లు మాత్రమే అని కేంద్రం మొదటి నుంచి చెబుతూ వస్తోందన్నారు. అయితే ఇటీవల రూ.10 వేల కోట్లు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. సీఎం వైఎస్ జగన్ మాత్రం రెవెన్యూ లోటు కింద కేంద్రం నుంచి రూ.35 వేల కోట్లు రావాలని అడుగుతున్నారన్నారు.