వార్ వ‌న్‌సైడే అంటున్న వైసీపీ ఫైర్‌బ్రాండ్‌

2024 ఎన్నిక‌ల్లో వార్‌సైడే అని వైసీపీ మ‌హిళా ఫైర్‌బ్రాండ్ ఆర్కే రోజా అన్నారు. జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై త‌న మార్క్ పంచ్‌ల‌ను విసిరారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై సినీ భాష‌లో విమ‌ర్శ‌లు గుప్పించారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ కేవ‌లం రీల్ హీరో…

2024 ఎన్నిక‌ల్లో వార్‌సైడే అని వైసీపీ మ‌హిళా ఫైర్‌బ్రాండ్ ఆర్కే రోజా అన్నారు. జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై త‌న మార్క్ పంచ్‌ల‌ను విసిరారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై సినీ భాష‌లో విమ‌ర్శ‌లు గుప్పించారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ కేవ‌లం రీల్ హీరో మాత్ర‌మే అన్నారు. కానీ త‌మ అధినేత‌, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మాత్రం రియ‌ల్ హీరో అని రోజా చెప్పుకొచ్చారు.

మంగ‌ళ‌వారం ఆమె మీడియాతో మాట్లాడారు. రెండున్న‌ర గంట‌ల్లో ప‌వ‌న్‌క‌ల్యాణ్ ముఖ్య‌మంత్రి, ప్ర‌ధాని మంత్రి, లేదా రాష్ట్ర‌ప‌తి అయినా కావ‌చ్చ‌ని దెప్పి పొడిచారు. కానీ రియ‌ల్ లైఫ్‌లో రియ‌ల్ హీరో జ‌గ‌నే అన్నారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ రీల్ మాత్ర‌మే అని వెట‌క‌రించారు. గుంపులు గుంపులుగా ఎంత మంది వ‌చ్చినా, త‌మ‌ వైపు నుంచి సింహం సింగిల్‌గానే వ‌స్తుందని డైలాగ్ చెప్పారు.

రాష్ట్రం, దేశ‌మంతా తిరిగి చూసేలా మ్యానిఫెస్టోను మూడేళ్ల‌లో 95 శాతం అమ‌లు చేశార‌న్నారు. త‌ద్వారా అంద‌రితో జ‌గ‌న్ శ‌భాష్ అనిపించుకున్నారన్నారు. ఏ ఎన్నిక‌లొచ్చినా ప్ర‌జలంద‌రి ఆశీర్వాదంతో వార్ వ‌న్‌సైడే అని ఉత్సాహంగా చెప్పారామె. రాబోయే 2024 ఎన్నిక‌ల్లో ఇదే ప‌రిస్థితి ఉంటుంద‌న్నారు. 

రానున్న ఎన్నిక‌ల్లో ఖ‌చ్చితంగా 165 సీట్ల‌కు పైగానే గెలుస్తామ‌ని రోజా ధీమా వ్య‌క్తం చేశారు. ఆత్మ‌కూరు ఉప ఎన్నిక‌లో భాగంగా రోజాకు వైసీపీ బాధ్య‌త‌లు అప్ప‌గించింది. చేజర్ల మండలంలో ఎన్నిక‌ల బాధ్య‌త‌ల్ని మంత్రి ఆర్కే రోజా, ఎమ్మెల్యే కొడాలి నాని భుజాల‌పై పార్టీ పెట్టింది. ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఆమె ప్ర‌త్య‌ర్థుల‌పై మాట‌ల తూటాలు పేల్చ‌డం స్టార్ట్ చేశారు.