మ‌హిళ‌ల‌ను స్టెప్నీ అంటావా?

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు ఏపీ మ‌హిళా క‌మిష‌న్ తాజాగా నోటీసు జారీ చేసింది. ఇటీవ‌ల జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఆవేశంతో ఊగిపోయారు. అధికార పార్టీ నేత‌ల‌పై ఇష్టానుసారం నోరు పారేసుకున్నారు. ప్యాకేజీ స్టార్ అంటే…

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు ఏపీ మ‌హిళా క‌మిష‌న్ తాజాగా నోటీసు జారీ చేసింది. ఇటీవ‌ల జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఆవేశంతో ఊగిపోయారు. అధికార పార్టీ నేత‌ల‌పై ఇష్టానుసారం నోరు పారేసుకున్నారు. ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడ్తాన‌ని హెచ్చ‌రించారు. అలాగే త‌న మూడు పెళ్లిళ్ల‌పై ప‌దేప‌దే మాట్లాడే నేత‌ల‌పై మండిప‌డ్డారు.

ఇద్ద‌రు భార్య‌ల‌కు భ‌ర‌ణం చెల్లించి, విడాకులు ఇచ్చిన త‌ర్వాతే మూడో పెళ్లి చేసుకున్నాన‌ని, మీరు చేసుకోండ్రా నా కొడుకుల్లారా, ఎవ‌రు వ‌ద్ద‌న్నార‌ని ప‌వ‌న్ తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తిన సంగ‌తి తెలిసిందే. మీలా ఒక పెళ్లి చేసుకుని, 30 మంది స్టెప్నీలు పెట్టుకుంటున్నార‌ని ప్ర‌త్య‌ర్థుల‌పై ఫైర్ అయ్యారు. ఈ వ్య‌వ‌హారం స‌ర్దుమ‌ణిగింద‌ని అనుకుంటున్న త‌రుణంలో ఏపీ మ‌హిళా క‌మిష‌న్ ఎంట‌ర్ అయ్యింది.

మ‌హిళ‌ల‌పై అనుచిత వ్యాఖ్య‌ల‌కు ముందుగా ప‌వ‌న్‌క‌ల్యాణ్ క్ష‌మాప‌ణ చెప్పాల‌ని మ‌హిళా క‌మిష‌న్ ఆదేశించింది. మూడు పెళ్లిళ్ల వ్యాఖ్య‌ల‌ను వెంట‌నే వెన‌క్కి తీసుకోవాల‌ని డిమాండ్ చేసింది. అలాగే భ‌ర‌ణం ఇస్తే భార్య‌ను వ‌దిలించుకోవ‌చ్చ‌నే సందేశాన్ని ప‌వ‌న్ వ్యాఖ్య‌లు ఇస్తున్నాయ‌ని మ‌హిళా క‌మిష‌న్ అభిప్రాయ‌ప‌డింది. ముఖ్యంగా మ‌హిళ‌ల‌ను ఉద్దేశించి స్టెప్నీ అనే ప‌దం వాడ‌డం తీవ్ర ఆక్షేప‌ణీయ‌మ‌ని మ‌హిళా క‌మిష‌న్ పేర్కొంది. ప‌వ‌న్ మాట‌లు మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌కు పెను ప్ర‌మాదంగా మారుతాయ‌ని మ‌హిళా క‌మిష‌న్ ఆందోళ‌న వ్య‌క్తం చేసింది.

గ‌తంలో చంద్ర‌బాబునాయుడు, బొండా ఉమా, రాంగోపాల్‌వ‌ర్మల‌కు మ‌హిళా క‌మిష‌న్ నోటీసులు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా మ‌రో సెల‌బ్రిటీ ఆ జాబితాలో చేరారు. మ‌హిళా క‌మిష‌న్ నోటీసుపై ప‌వ‌న్ ఎలా స్పందిస్తారో చూడాలి.