అన్ని పార్టీలను కలిపిన యార్లగడ్డ

రాజ్యసభ మాజీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ డెబ్బై ఏళ్ళ పుట్టిన రోజు వేడుకలకు పార్టీలకు అతీతంగా కీలక నాయకులు అంతా పెద్ద ఎత్తున తరలివచ్చారు. సినీ రాజకీయ ప్రముఖుల తాకిడితో విశాఖ సందడి…

రాజ్యసభ మాజీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ డెబ్బై ఏళ్ళ పుట్టిన రోజు వేడుకలకు పార్టీలకు అతీతంగా కీలక నాయకులు అంతా పెద్ద ఎత్తున తరలివచ్చారు. సినీ రాజకీయ ప్రముఖుల తాకిడితో విశాఖ సందడి చేసింది.

పూర్వ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యన్నాయుడు, మిజోరాం గవర్నర్ కె హరిబాబు ముఖ్య అతిధులుగా విచ్చేసిన యార్లగడ్డ పుట్టిన రోజు వేడుకలకు సకల పార్టీల నేతలు కదలి రావడం విశేషం. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఒకేసారి అన్ని పార్టీల నాయకులను కలిపేశారు. ఏపీలో పాలిటిక్స్ ఎపుడూ హాట్ హాట్ గా ఉంటుంది. అలాంటి చోట వైసీపీ టీడీపీ నాయకలను ఒక్క చోట చేర్చారు. 

వైసీపీ మంత్రులు గుడివాడ అమరనాధ్, మేరుగు నాగార్జున, తెలుగుదేశం నుంచి మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణ మూర్తి, ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, కాంగ్రెస్ మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, ఉండవల్లి అరుణ్ కుమార్, బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు వంటి వారు హాజరయ్యారు.

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున, సినీ దర్శకుడు కె రాఘవేంద్రరావు వంటి వారూ హాజరయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పక్కపక్కన కూర్చుని మాట్లాడుకోవడం కనిపించింది. మరి ఏమి మాట్లాడుకున్నారో తెలియదు కానీ అందరి చూపూ అటు వైపే పడింది. ఈ మధ్య జగన్ని తరచూ విమర్శిస్తున్న గంటాతో విజయసాయిరెడ్డి మాటా మంతీ రాజకీయంగా విశేషంగానే అనిపించాయి. 

యార్లగడ్డకు ఉన్న పలుకుబడి ఆయనకు అన్ని రంగాలలో ప్రముఖుల ఉన్న పరిచయాలు ఈ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా లోకానికి మరోసారి తెలిశాయి.