టాలీవుడ్ ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్పై ఎల్లో మీడియా దాడి స్టార్ట్ చేసింది. కేంద్రహోంశాఖ మంత్రి అమిత్షా ఆహ్వానం మేరకు కలవాలని నిర్ణయించుకోవడం ఎల్లో మీడియా దృష్టిలో నేరమైంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కమ్మ సామాజిక వర్గాన్ని, టీడీపీ శ్రేణుల్ని తన వైపు తిప్పుకోవడమే వ్యూహమనే చర్చకు తెరలేచింది. బీజేపీ తురుపు ముక్కగా జూనియర్ ఎన్టీఆర్ను వాడుకోవాలని భావిస్తున్నట్టు టీడీపీ ఆందోళన చెందుతోంది.
ప్రధానంగా అమిత్షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ కావాలనే నిర్ణయం వెనుక హీరో మేనత్త, బీజేపీ అగ్రనాయకురాలు పురందేశ్వరి ఉన్నారని ఎల్లో మీడియా అనుమానిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ను దగ్గరికి తీసుకోవడం ద్వారా టీడీపీ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవచ్చనే ఎత్తుగడ కనిపిస్తోందని ఎల్లో మీడియా విశ్లేషిస్తోంది. బీజేపీ తాజా ఎత్తుగడపై టీడీపీ ప్రేక్షకపాత్ర పోషిస్తూ, తన మీడియాను ఉసిగొల్పుతోంది.
ఏపీలో వైసీపీ వ్యతిరేకతను జూనియర్ ఎన్టీఆర్ ద్వారా తమ వైపు తిప్పుకోవాలని బీజేపీ వ్యూహం రచించిందనే ప్రచారాన్ని ఎల్లో మీడియా చేస్తోంది. దీనివల్ల టీడీపీ నష్టపోతుందనే ఆందోళన సదరు మీడియా విశ్లేషణల్లో ప్రతిబింబిస్తోంది. అయితే సినీ రంగంలో ఎంతో భవిష్యత్ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ బీజేపీ గాలానికి పడుతారా? అంటూ ఎల్లో మీడియా ప్రశ్నిస్తోంది.
జూనియర్ ఎన్టీఆర్ ఎంతో తెలివైన వాడు, మంచి మాటకారిగా పేరున్న జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ అద్భుతంగా దూసుకుపోతోందని చెబుతూనే, మరో మాట కూడా అంటుండడం గమనార్హం.
ఈ సమయంలో ఉజ్వల కెరీర్ను చెడగొట్టుకునేంత తెలివి తక్కువ వాడు ఎన్టీఆర్ కాదని ఆయన్ను దువ్వడాన్ని గమనించొచ్చు. దివంగత ఎన్టీఆర్ కుటుంబానికి చెందిన జూనియర్ ఎన్టీఆర్కు …పెద్ద కుటుంబంలోని మిగిలిన వాళ్లతో చిన్నచిన్న విభేదాలు ఉండొచ్చని అంటూనే, రాజకీయాల కోసం అందరినీ దూరం చేసుకోరని ఎల్లో మీడియానే చెప్పడం గమనార్హం. మొత్తానికి టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ వ్యవహారం కలకలం రేపుతోంది.