టీడీపీలో అసంతృప్త జ్వాలలు ఎగిసి పడుతున్నాయి. పొత్తులో భాగంగా నాయకులు త్యాగాలు చేయక తప్పదని చంద్రబాబు మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. అయితే సీనియర్ నేతలు తమకు దక్కకుండా ఎక్కడికి పోతుందిలే అనే ధీమాలో వుంటూ వచ్చారు. అలాంటి నాయకులకే టికెట్ దక్కకపోవడంతో ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఈ నేపథ్యంలో టీడీపీ ముఖ్య నాయకుడు, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్కి చంద్రబాబు భారీ షాక్ ఇచ్చారు.
మాజీ మంత్రి ఆలపాటికి రాజకీయ భవిష్యత్ లేకుండా చేశారు. ఈ పరిణామాల్ని ఆలపాటి , ఆయన అనుచరులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడు పోటీ చేయకపోతే శాశ్వంగా రాజకీయ సమాధి కట్టినట్టే అని ఆలపాటి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ టీడీపీ మూడో జాబితా విడుదలైంది. అందులో తనకు చోటు లేకపోవడం, ఇక మిగిలింది ఐదారు సీట్లే కావడంతో ఆలపాటి రాజేంద్రప్రసాద్ మనస్తాపం చెందారు.
గుంటూరు జిల్లా తెనాలి నుంచి ఆలపాటి రాజకీయ చేస్తున్నారు. అక్కడ ఆయనకు బలమైన వర్గం వుంది. మరోసారి అక్కడి నుంచే పోటీ చేసేందుకు క్షేత్రస్థాయిలో పనులు చేసుకుంటూ వచ్చారు. అయితే జనసేన, బీజేపీతో టీడీపీకి పొత్తు కుదరడం ఆలపాటి పాలిట శాపమైంది. తెనాలి సీటును జనసేన ముఖ్య నాయకుడు నాదెండ్ల మనోహర్కు పవన్ ప్రకటించారు. దీంతో ఆయన తెనాలిలో కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ప్రచారానికి కూడా వెళ్తున్నారు.
తెనాలి కాకుండా, గుంటూరులో ఏదో ఒక సీటు దక్కుతుందని ఆలపాటి నమ్మకంగా ఉన్నారు. ఇప్పుడు ఏదీ లేకపోవడంతో భవిష్యత్ కార్యాచరణపై సాయంత్రం నాలుగు గంటలకు అనుచరులతో చర్చించేందుకు ఆలపాటి సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఆలపాటి రాజీనామాపై కీలక ప్రకటన చేసే అవకాశం వుందంటున్నారు. అదే జరిగితే టీడీపీకి భారీ నష్టం అని చెప్పక తప్పదు. ఎందుకంటే టీడీపీలో ఆయన నిఖార్సైన నాయకుడు. పొత్తు బాధితుడిగా టీడీపీ నుంచి నిష్క్రమించే పరిస్థితి ఉత్పన్నం కావడం చర్చనీయాంశమైంది.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు