విజయవాడలో శనివారం రాత్రి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దాడికి రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో నిరసన వెల్లువెత్తుతోంది. ఈ దాడి వెనుక ప్రతిపక్ష నేతల ప్రమేయం వుందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్పై దాడిని ఖండిస్తూ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి నేతృత్వంలో నగరంలోని జీవకోనలో నడిరోడ్డుపై ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి మాట్లాడుతూ తమ నాయకుడు జగన్పై చంద్రబాబు, పవన్కల్యాణ్ హత్యాయత్నానికి పాల్పడ్డారని ఘాటు విమర్శ చేశారు. చంద్రబాబు, పవన్కల్యాణ్ ఇటీవల ఏ వేదికెక్కినా జగన్ పనై పోయిందని, అంతుచూస్తామని హెచ్చరించడాన్ని భూమన గుర్తు చేశారు. జగన్పై తమ కార్యకర్తలు, గూండాలను రెచ్చగొట్టేలా బాబు, పవన్ మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు.
జగన్పై ముమ్మాటికీ హత్యాయత్నమే అని భూమన విమర్శ చేశారు. హత్యా రాజకీయాలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఆయన చెప్పారు. చంద్రబాబు గత చరిత్ర అంతా రక్తంతో తడిసిపోయిందన్నారు. ఈ రోజు అందులో పవన్కల్యాణ్ భాగస్వామి అయ్యారని భూమన ఆరోపించారు. జగన్ను నేరుగా రాజకీయంగా ఎదుర్కోలేక, భౌతికంగా అంతమొందించే కుట్రకు తెరలేపారని భూమన ఆరోపించారు. ఈ కుట్రలో చంద్రబాబు, పవన్ చేసిన రెక్కీ మాత్రమే ఇది అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన కోట్లాది మంది ప్రజల గుండెల్ని చంద్రబాబు, పవన్ గాయపరిచారని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి వైసీపీ అభ్యర్థి భూమన అభినయ్, మేయర్ డాక్టర్ శిరీష , డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ తదితరులు పాల్గొన్నారు.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు