ఏపీలో కూటమి అధికారంలోకి వస్తే... ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు రద్దయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇందుకు తాజాగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కామెంట్స్ బలం కలిగిస్తున్నాయి. గతంలో వైఎస్సార్ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముస్లింల దుర్భిక్ష జీవితాల్ని మార్చాలనే సదుద్దేశంతో వారికి నాలుగు శాతం రిజర్వేషన్లు సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత. ముస్లింలకు రిజర్వేషన్లు మాత్రం కొనసాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఏపీలో టీడీపీ, జనసేనతో జత కట్టిన బీజేపీ... ఎలాగైనా ముస్లింల రిజర్వేషన్లను ఎత్తి వేయాలనే ఆలోచనలో వుంది. మతపరమైన రిజర్వేషన్లను రద్దు చేస్తామని బీజేపీ బహిరంగంగానే ప్రకటిస్తోంది. అలాగే తమ మేనిఫెస్టోలో కూడా ఆ అంశాన్ని చేర్చింది. ఇదిలా వుండగా ఇవాళ చంద్రబాబునాయుడితో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమావేశం అయ్యారు. అనంతరం ముస్లింల రిజర్వేషన్లపై కీలక కామెంట్స్ చేశారు.
తాము ముస్లింల రిజర్వేషన్లకు వ్యతిరేకమని కుండబద్ధలు కొట్టినట్టు తేల్చి చెప్పారు. చంద్రబాబుతో భేటీ తర్వాత ప్రత్యేకంగా ముస్లిం రిజర్వేషన్లపై ఘాటు కామెంట్స్ చేయడం చర్చనీయాంశమైంది. ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు చేస్తామని చంద్రబాబుకు కేంద్ర పెద్దలు చెప్పారనే ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారానికి బీజేపీ, టీడీపీ, జనసేన నేతల మధ్య చర్చలు, అనంతరం ప్రకటనలు బలం కలిగిస్తున్నాయి.
చంద్రబాబు తన రాజకీయ స్వార్థానికి చివరికి తమ గొంతు కోస్తున్నారని ముస్లింలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. వైఎస్సార్ హయాంలో రిజర్వేషన్లు కల్పించారని వారు గుర్తు చేస్తున్నారు. చంద్రబాబునాయుడు తమకు మంచి చేయకపోయినా ఫర్వాలేదని, ద్రోహం చేసేలా వత్తాసు పలకడం ఏంటనే నిలదీత ముస్లింల వైపు నుంచి వస్తోంది. కూటమికి ఓటు వేస్తే, ఏపీలో ముస్లింల రిజర్వేషన్ల రద్దు ఖాయంగా కనిపిస్తోందనే చర్చ సర్వత్రా జరుగుతోంది.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు