ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఎవరిని ఎలా వాడుకోవాలో బాగా తర్ఫీదు పొందినట్టున్నారు. చనిపోయిన వైఎస్సార్ను ప్రతిక్షణం తన రాజకీయ స్థార్థానికి షర్మిల ఎలా వాడుకుంటున్నారో అందరికీ తెలిసిందే. ఇక వైఎస్సార్ జీవించిన రోజుల్లో ఆమె ఏ రకంగా ఉపయోగించుకుని వుంటారో ఊహించుకోవచ్చు. తెలంగాణలో వైఎస్సార్ పేరుతో రాజకీయ పార్టీని స్థాపించి, ఆ తర్వాత వర్కౌట్ కాకపోవడంతో కాంగ్రెస్లో విలీనం చేశారు.
ఇప్పుడామె ఏపీలో తన మార్క్ రాజకీయాలు చేస్తూ, దివంగతులైన వైఎస్సార్, వివేకాలను ఇష్టమొచ్చినట్టు వాడుకుంటున్నారు. అయితే ఇక్కడో విషయాన్ని గమనించాలి. ఇడుపులపాయలోని వైఎస్సార్ సమాధి వద్ద నివాళులర్పించి, పదేపదే ఆశీస్సులు తీసుకుంటున్నట్టు బిల్డప్ ఇస్తుంటారు. కానీ తన రాజకీయానికి పని కొచ్చే వివేకానందరెడ్డి, ఆశీస్సులకు మాత్రం అబ్బే ఆమెకు గుర్తు రారు.
పులివెందులలో వివేకా భౌతిక కాయాన్ని సమాధి చేశారు. తన ప్రత్యర్థి వైఎస్ అవినాష్రెడ్డిపై వివేకా హత్యను అడ్డు పెట్టుకుని తీవ్ర ఆరోపణలు చేస్తూ, ఓట్లను ఏరుకోవాలని అనుకుంటున్న షర్మిలకు, ఎప్పుడైనా ఆయన సమాధిని సందర్శించాలన్న ఆలోచన వచ్చిందా? అనే ప్రశ్న ఉదయిస్తోంది. షర్మిలకు వివేకా హత్య కావాలే తప్ప, ఆయన ఆశీస్సులు పొందాలన్న ధ్యాస ఉండదు. ఎందుకంటే షర్మిలకు వివేకాతో మంచి సంబంధాలు లేవని వారి కుటుంబంలో ఎవరిని అడిగినా చెబుతారు.
వివేకా జీవించిన రోజుల్లో ఆయనతో షర్మిల కలిసి ఉన్న ఫొటోను చూసిన వాళ్లు చాలా తక్కువ మంది వుంటారు. ఎందుకంటే వివేకా అంటే షర్మిలకు మొదటి నుంచి అసలు గిట్టేది కాదని వారి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వ్యక్తిగత, రాజకీయ అవసరాలకు ఎవరినైనా వాడుకోవడంలో షర్మిల దిట్ట అనే విమర్శ వుంది. దీన్ని బలపరిచేలా షర్మిల పంథా వుంది.
తన పిల్లల వివాహ పత్రిక, అలాగే తాజాగా నామినేషన్ పత్రాలను వైఎస్సార్ సమాధి వద్ద ఉంచి ఆశీస్సులు తీసుకున్నారే తప్ప, ఇంత వరకూ వివేకా సమాధి వైపు ఆమె కన్నెత్తి చూసిన పాపాన పోలేదని పులివెందుల వాసులు చెబుతున్నారు. షర్మిలకు కావాల్సింది వివేకాను అడ్డం పెట్టుకుని రాజకీయ లబ్ధి పొందడం మాత్రమే. అంతకు మించి వివేకా, ఆయన కుటుంబంపై ఆమెకు ఏ మాత్రం ప్రేమాభిమానాలు లేవని సర్వత్రా వినిపిస్తున్న మాట.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు