వైఎస్సార్ జిల్లా కమలాపురంలో సీఎం వైఎస్ జగన్ మేనమామ, ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్రెడ్డికి కాలం కలిసొస్తోంది. నిజానికి ఆయనకు నెలన్నర క్రితం వరకూ రాజకీయంగా అంత మంచిగా లేదనే టాక్ వినిపించింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నెమ్మదిగా కమలాపురంలో వైసీపీకి అనుకూల వాతావరణం ఏర్పడుతోంది.
ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే గండ్లూరు వీరశివారెడ్డి త్వరలో వైసీపీలో చేరనున్నారు. ఈ మేరకు ప్రొద్దుటూరులో ఆయన ఇంటికి కమలాపురం వైసీపీ కోఆర్డినేటర్ దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి వెళ్లి చర్చించారు. నెలన్నర క్రితం టీడీపీలో వీరశివారెడ్డి చేరారు. కమలాపురం టికెట్ను ఆశించారు. ఒకవేళ తనకు కమలాపురం టికెట్ ఇవ్వకపోయినా, తన తమ్ముడి కుమారుడు గండ్లూరు ప్రవీణ్రెడ్డికి ప్రొద్దుటూరు టికెట్ ఇస్తారని ఆశించారు.
ఎందుకంటే ప్రవీణ్రెడ్డి ప్రొద్దుటూరు టీడీపీ ఇన్చార్జ్ కూడా. ముఖ్యంగా తన తమ్ముడి కుమారుడిని రాజకీయంగా వాడుకుని, ఇప్పుడు మరొకరికి టికెట్ ఇవ్వడం, అలాగే కమలాపురంలో ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటున్న పుత్తా నరసింహారెడ్డి కుమారుడు చైతన్యరెడ్డికి టికెట్ ఇచ్చారని వీరశివారెడ్డి ఆగ్రహంగా వున్నారు. దీంతో తనకు రాజకీయంగా అంతోఇంతో పట్టు వున్న కమలాపురం నియోజకవర్గంలో పుత్తా చైతన్యకు మద్దతు ఇవ్వడానికి వీరశివారెడ్డి సిద్ధంగా లేరు.
మరోవైపు రాష్ట్రంలో మరోసారి వైసీపీ అధికారంలోకి వచ్చే వాతావరణం వుండడంతో వీరశివారెడ్డి టీడీపీలో కొనసాగడానికి ఇష్టపడడం లేదని తెలిసింది. దీంతో తన కుమారుడు, డీసీసీబీ మాజీ చైర్మన్ అనిల్కుమార్రెడ్డి, అనుచరులతో కలిసి త్వరలో వైసీపీలో చేరడానికి వీరశివారెడ్డి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వైసీపీలో వీరశివారెడ్డి చేరిక ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డికి కలిసొస్తుంది. ఈ చేరిక వైసీపీ గెలుపునకు తప్పక దోహదపడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు