Advertisement

Advertisement


Home > Politics - Andhra

సునీతా, ష‌ర్మిలా నోర్మూసుకోండి.. నాశ‌న‌మ‌వుతారుః మేన‌త్త‌

సునీతా, ష‌ర్మిలా నోర్మూసుకోండి.. నాశ‌న‌మ‌వుతారుః మేన‌త్త‌

వైఎస్సార్‌, వివేకా ఏకైక ముద్దుల చెల్లి విమ‌లారెడ్డి ఇవాళ మీడియాతో మాట్లాడారు. ష‌ర్మిల‌, సునీత‌ల వైఖ‌రిపై ఆమె తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. వైఎస్సార్ శ‌త్రువుల‌తో క‌లిసి జ‌గ‌న్‌ను దెబ్బ తీయ‌డానికి కుట్ర ప‌న్నార‌ని ఆమె విమ‌ర్శించారు. చెప్పినా విన‌క‌పోవ‌డంతో విజ‌య‌మ్మ అమెరికా వెళ్లిపోయార‌ని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తాను మంచీచెడుల గురించి అక్కాచెల్లెళ్లిద్ద‌రికీ చెప్ప‌డంతో, అప్ప‌టి నుంచి మాట్లాడ్డం మానేశార‌ని ఆమె అన్నారు. మీడియా స‌మావేశంలో విమ‌లారెడ్డి ఏం మాట్లాడారో ఆమె మాట‌ల్లోనే...

"పులివెందుల్లో మా ష‌ర్మిల‌మ్మ కొంగు ప‌ట్టుకుని ఓట్లు అడుగుతోంది. రాజ‌కీయాల్లో కొంగు ప‌ట్టుకుని సెంటిమెంట్‌తో గెల‌వ‌గ‌లిగితే మ‌రి నాయ‌క‌త్వ ల‌క్ష‌ణం ఎక్క‌డుంది? మాట‌కు ముందు వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కుమార్తెన‌ని అంటోంది. రాజ‌శేఖ‌ర‌రెడ్డి అన్న వుంటే ఇలా చేసేవారా? ఒక లీడ‌ర్‌కు ఉన్న ల‌క్ష‌ణాలు ఏమున్నాయ్‌? అన‌వ‌స‌రంగా అవినాష్‌రెడ్డిపై నిందారోప‌ణ‌లు చేస్తున్నారు. అవినాష్ హ‌త్య చేసింది చూశారా? ఆధారాలున్నాయా? హ‌త్య చేసినోడు బ‌య‌ట తిరుగుతున్నాడు. వాడు చెప్పిన మాట‌లు న‌మ్మి వీళ్లు హంతకుడిని నిర్ధారిస్తారా?  మ‌రి న్యాయ‌స్థానాలు, న్యాయ‌మూర్తులు ఎందుకు?  ష‌ర్మిల‌, సునీత కంటే అవినాష్‌రెడ్డి ప‌దేళ్లు చిన్న‌. అలాంటి వ్య‌క్తి జీవితాన్ని నాశ‌నం చేస్తున్నారు.

అవినాష్ కూడా మా ఇంట్లో పిల్లోడే. ఏ పాపం చేయ‌ని మా భాస్క‌ర‌న్న జైల్లో ఉన్నాడు. అవినాష్‌కు బెయిల్ ర‌ద్దు చేయాల‌ని అక్కాచెల్లెళ్లిద్ద‌రూ తిరుగుతున్నారు. ఇదేం న్యాయం? వింటున్న మీర‌న్నా చెప్పండి. మా ఇంట్లో పాప ఇట్లా త‌యారైందంటే చాలా బాధ‌గా వుంది. జ‌గ‌న్‌ను క‌లుపుతోంది. శ‌త్రువులు మ‌న మీదికి వ‌స్తే ..మ‌న విభేదాల‌న్నీ ప‌క్క‌న పెట్టి ఇంట్లో వాళ్లంద‌రం ఒక్క‌ట‌వుతాం. కానీ ఇక్క‌డ ప్ర‌కృతి సిద్ధంగా లేదు. పులివెందుల్లో అక్కాచెల్లెళ్ల ప్ర‌సంగాల వీడియోలు చూశాక బీపీ పెరిగింది. ఇలా ఎంత మందికి ఉందో?  

వివేకం అన్నా నాకు క్లోజ్ కాదా? ఒక్క‌గానొక్క చెల్లెల్ని. న‌న్ను నెత్తిన పెట్టుకుని చూసుకున్నారు. వాళ్లిద్ద‌రి (ష‌ర్మిల‌, సునీత‌) ప్రేమ కంటే నా ప్రేమ ఎక్కువ‌ని గ‌ట్టిగా చెప్ప‌గ‌ల‌ను. వివేకం హ‌త్య నాకు బాధ క‌లిగిస్తోంది. కానీ దాన్ని రాజ‌కీయం చేయ‌డంతో వాళ్ల (అవినాష్‌) ఇంట్లో వాళ్లంతా ఏడుస్తున్నారు. వీళ్లిద్ద‌రు జ‌గ‌న్‌, అవినాష్‌పై క‌క్ష పెట్టుకోవ‌డంతో రాష్ట్ర‌మంతా అల్ల‌క‌ల్లోలం అవుతోంది.

పులివెందుల్లో వైసీపీ, కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు కొట్టుకోవ‌డం న్యాయంగా ఉన్నాయా? అమ్మాయిల్లారా మేన‌త్త‌గా చెబుతున్నా... ద‌య‌చేసి మీరు మారండి. ఇప్ప‌టికైనా నోరు మూసుకోండి. మీరు చేసేది స‌రైంది కాదు. రాష్ట్రాన్ని పాడు చేస్తున్నారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో పేద‌లంద‌రికీ సంక్షేమ ప‌థ‌కాలు అందుతున్నాయి. వాళ్లంతా సంతోషంగా ఉన్నారో నేను చూస్తున్నా. అలాంటి ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టాల‌ని మీరు ప్ర‌య‌త్నిస్తున్నారు. మీకు అస‌లు క‌రుణ, జాలి లేవా? బంధువులంతా మ‌ద్ద‌తు ప‌లుకుతార‌ని అనుకుంటున్నారేమో. రాజ‌శేఖ‌ర‌రెడ్డి బిడ్డ అయినంత మాత్రాన నువ్వు చేసేదంతా స‌రైంద‌ని అనుకోవ‌ద్దమ్మా ష‌ర్మిలా. వైఎస్సార్ పేరు చెప్పుకుని తిరుగుతూ ఆయ‌న‌కు అవ‌మాన‌క‌రంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు.

ష‌ర్మిలా నువ్వు చేసేదేమైనా రాజ‌శేఖ‌ర‌న్నా సంతోషంగా చూస్తున్నాడని అనుకుంటున్నావా? వైఎస్సార్ శ‌త్రువులంతా నీ చుట్టూ చేరారు. వాళ్ల‌తో ఏక‌మై పోయావు. రాజ‌శేఖ‌ర‌న్నా ఉన్న‌ప్పుడు ఆయ‌న్ను ఎంత మంది క‌ష్ట‌పెట్టారో, ఇప్పుడు వాళ్లంతా నీతో ఉన్నారు. ష‌ర్మిలా నీ క‌ళ్లు, చెవులు మూసుకుపోయాయేమో అనిపిస్తోంది.ఇద్ద‌రు కూచుని మాట్లాడుకోండి. మీరు చేసే ప‌నులు క‌రెక్ట్‌గా ఉన్నాయా? లేదా? అని చ‌ర్చించుకోండి.

ప్ర‌జ‌ల‌కు ఎంత హాని చేస్తున్నారో చూసుకోండి. అస‌లు మీకు ప్ర‌జ‌ల‌పై ప్రేమ వుందా? మీ నాన్న‌కు ఉన్న ప్రేమ‌లో క‌నీసం ఒక వందో వంతైనా వుందా మీకు? నిస్వార్థంగా పాల‌న సాగిస్తున్న జ‌గ‌న్‌ను పాడు చేయాల‌ని చూస్తున్నారు. మీ చుట్టూ ఉన్నోళ్లంతా మిమ్మ‌ల్ని నాశ‌నం చేయ‌డానికి చూస్తున్నారు. ఆ ఊబిలోకి వెళ్లొద్దు. శ‌త్రువులంతా ఏకం అయ్యారు. జాగ్ర‌త్త‌. మీరు నాశ‌న‌మై పోతారు. మీ మ‌న‌సుల్ని మార్చాల‌ని దేవుని కోరుకుంటున్నా"

విమ‌లారెడ్డి తాజా కామెంట్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. అక్కాచెల్లెళ్లిద్ద‌రికీ గ‌ట్టిగా బుద్ధి చెప్పార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?