పంచాయతీ కార్యాలయాల రంగుల గోల సమసిపోయిందనుకుంటే …మళ్లీ కోర్టు మెట్లెక్కింది. పంచాయతీ కార్యాలయాలు, ఇతర ప్రభుత్వ భవనాలకు అధికార పార్టీ వైసీపీ రంగులు వేయడంపై న్యాయస్థానంలో సుదీర్ఘ పోరాటం జరిగిన విషయం తెలిసిందే.
దీనిపై హైకోర్టు మొదలుకుని సర్వోన్నత న్యాయస్థానం వరకూ పోరాటం సాగింది. చివరికి న్యాయ స్థానాల మొట్టికాయలతో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాలకు వేసిన రంగులను తొలగించింది.
దీంతో ఈ వ్యవహారం ముగిసిపోయిందని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ మరో రూపంలో రంగుల వ్యవహారం తాజాగా హైకోర్టును చేరింది. రంగులేయడంతో పాటు వాటి తొలగింపునకు రూ.4 వేల కోట్లు ఖర్చు అయిందని, ఆ సొమ్మును రాబట్టాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ రూ.4 వేల కోట్ల ప్రజాధనాన్ని ఖజానాకు జమ చేయాలని పిటిషన్లో కోరారు.
అయితే పిటిషనర్ అత్యుత్సాహంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, బొత్స సత్యనారాయణలను వ్యక్తిగతంగా ప్రతివాదులుగా చేర్చడం గమనార్హం.
నీలం సాహ్ని, బుగ్గన, బొత్సలను వ్యక్తిగత ప్రతివాదులుగా చేర్చడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. వాళ్లను వ్యక్తిగత ప్రతివాదులుగా ఎలా చేరుస్తారని హైకోర్టు గట్టిగా నిలదీసింది. అలాగే అఫిడవిట్ సరిగా వేయాలని పిటిషనర్ను హైకోర్టు ఆదేశించింది.