కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పను మారుస్తారనే ప్రచారం మళ్లీ ఊపందుకుంది. బిహార్ లో అనుకూల ఫలితాలు వస్తే బీజేపీ చేయబోయే మార్పుల్లో ఒకటి యడియూరప్ప మార్పు అనే వార్తలు ముందే వచ్చాయి. ఎలాగో బిహార్ లో తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ ఇప్పుడు కర్ణాటకలో రిపేర్లకు దిగనుందని, అందులో భాగంగా యడియూరప్పను సాగనంపున్నారని వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం యడియూరప్ప వయసు 77 సంవత్సరాలు. ఆయన అనూహ్య పరిస్థితుల్లో సీఎం అయ్యారు. జేడీఎస్- కాంగ్రెస్ సర్కారును కూలగొట్టాకా తప్పనిసరి పరిస్థితుల్లో యడియూరప్పను సీఎంగా చేసింది బీజేపీ. బీజేపీ వాళ్లు 75 యేళ్లు దాటిన వాళ్లు కీలక పదవులు చేపట్టరాదని ఒక తీర్మానం చేశారు. సీనియర్లను సాగనంపడానికి మోడీ, షాలు ఆ రూల్ ను పెట్టారనే అభిప్రాయాలున్నాయి. అయితే యడియూరప్పను మాత్రం రూల్ లోపలకు తీసుకురాలేకపోయారు.
ఆయన వెనుక కర్ణాటకలో ఒక సాలిడ్ క్యాస్ట్ ఓటు బ్యాంకు ఉంది. యడియూరప్పను పక్కన పెడితే ఆయన చేసే నష్టం ఎలా ఉంటుందో ఇది వరకే కమలానికి ఒకసారి అర్థం అయ్యింది. ఈ నేపథ్యంలో ఆయనను తప్పక సీఎంగా చేశారు. అయితే ఆయనకు వయసు మీదపడటం, 77 యేళ్ల వయసులో ఆయన యాక్టివ్ లేరు అనే టాక్ బీజేపీ నుంచే వస్తుండటంతో ఆయనను ఇప్పుడు బీజేపీ తప్పిస్తుందనే ప్రచారం జరుగుతూ ఉంది.
అయితే పదవిని వదలడానికి ఆయన సిద్ధంగా లేరు. ఆయనే కాదు.. ఎవరూ ఉండరు కాబట్టి.. ఇప్పుడు తప్పిస్తే ఆయన నొచ్చుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉంది. కానీ యడియూరప్పకు అధిష్టానం ఇప్పటికే చుక్కలు చూపిస్తోంది. కేబినెట్ పునర్వ్యస్థీకరణ గురించి ఆయన ఏడాది కాలంగా ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. అయినా.. అధిష్టానం ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదంటే.. ఆయనను ఎంత డమ్మీగా చేశారో అర్థం అవుతుంది.
యడియూరప్పను తప్పిస్తే.. కర్ణాటకలోని బలమైన లింగాయత్ క్యాస్ట్ ఓటు బ్యాంకు చెల్లాచెదురవుతుంది అనే భయం బీజేపీకి లేకపోలేదు. అందుకే ఆయనను కొనసాగిస్తూ వస్తోంది. ఇప్పుడు ఆయనను తప్పించి అదే క్యాస్ట్ కే చెందిన మరొకరిని సీఎంగా చేస్తారనే ప్రచారం జరుగుతూ ఉంది.
యడియూరప్ప తనయుడికి ఇటీవలే కర్ణాటక బీజేపీ ఉపాధ్యక్ష పదవి ఇచ్చి.. తాము విమర్శించే వారసత్వ రాజకీయాలకే బీజేపీ పెద్ద పీట వేస్తోంది. అటు యడియూరప్ప వారసుడికి స్థానం ఇచ్చి, ఇటు యడియూరప్ప కులం వ్యక్తికే సీఎం పీఠాన్ని అప్పగంచి.. వారసత్వ, కుల రాజకీయాలను చేసి.. కర్ణాటకలో ఉనికి కాపాడుకునే యత్నంలో ఉంది కమలం పార్టీ!
మిగతా పార్టీలను విమర్శించాలంటే.. వారసత్వ రాజకీయాలు అని, కుల రాజకీయాలు అని బీజేపీ వాళ్లు మాట్లాడుతూ ఉంటారు. తీరా ఆ పార్టీ రాజకీయలు ఇలా ఉన్నాయి. నల్ల గురివింద చందాన మారుతున్నట్టుంది కమలం పార్టీ తీరు!