టీడీపీ మిస్సింగ్ కంప్లైంట్స్..వైసీపీ కౌంట‌ర్ గ‌ట్టిగానే!

మిగ‌తా రాష్ట్రంతో త‌మ‌కు ప‌ని లేదు, అమ‌రావ‌తితోనే త‌మ లావాదేవీల‌న్నీ ఆధార‌ప‌డి ఉన్న‌ట్టుగా తెలుగుదేశం పార్టీ వ్య‌వ‌హారిస్తూ ఉంది. మూడు ప్రాంతాల‌కూ అనుకూల‌మైన ఫార్ములాను తెలుగుదేశం పార్టీ వ్య‌తిరేకిస్తూ ఉంది. ఆ పార్టీకి చెందిన…

మిగ‌తా రాష్ట్రంతో త‌మ‌కు ప‌ని లేదు, అమ‌రావ‌తితోనే త‌మ లావాదేవీల‌న్నీ ఆధార‌ప‌డి ఉన్న‌ట్టుగా తెలుగుదేశం పార్టీ వ్య‌వ‌హారిస్తూ ఉంది. మూడు ప్రాంతాల‌కూ అనుకూల‌మైన ఫార్ములాను తెలుగుదేశం పార్టీ వ్య‌తిరేకిస్తూ ఉంది. ఆ పార్టీకి చెందిన రాయ‌ల‌సీమ‌, ఉత్త‌రాంధ్ర నేత‌లు కూడా చంద్ర‌బాబు నాయుడు చెప్పిన‌ట్టుగా గుడ్డిగా త‌లాడించాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.

క‌ర్నూలు, విశాఖ ప్ర‌యోజ‌నాలు దెబ్బ‌తీయ‌డానికి కూడా ఆ ప్రాంతాల టీడీపీ నేత‌లు వెనుకాడ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇక రాజ‌ధానిలో తెలుగుదేశం పార్టీ కార్య‌క‌ర్త‌లు, ఆ పార్టీ పెయిడ్ ఆర్టిస్టులు ర‌క‌ర‌కాల నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేస్తూ ఉన్నారు. మామూలుగానే తెలుగుదేశం పార్టీకి పెయిడ్ ఆర్టిస్టులు కొద‌వేవీ కాదు. 

చేతిలో యాపిల్ ఐ ఫోన్ లెటెస్ట్ వెర్ష‌న్ల‌తో, మ‌ణిక‌ట్టుకు ఐ వాచ్ ల‌తో తెలుగుదేశం రైతులు నిర‌స‌న‌లు తెలుపుతూ ఉన్నారు. జీన్స్ లు వేసుకుని,  సెంట్లు కొట్టుకుని మ‌హిళా రైతులు నిర‌స‌న తెలుపుతున్నారు. ఇక వైసీపీ ఎమ్మెల్యేల‌పై కూడా  అక్క‌డ రాజ‌కీయం గ‌ట్టిగానే సాగుతూ ఉంది. రాజ‌ధాని ప్రాంత వైసీపీ ఎమ్మెల్యేలు మిస్ అంటూ వ‌ర‌స‌గా కంప్లైంట్లు ఇస్తున్నారు తెలుగుదేశం పార్టీ కార్య‌క‌ర్త‌లు.

ఇలాంటి నేప‌థ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ‌ట్టి కౌంట‌రే ఇచ్చింది. చంద్ర‌బాబునాయుడు క‌నిపించ‌డం లేద‌ని ఆ పార్టీ వాళ్లు ఫిర్యాదు చేశారు. కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో ఇది జ‌రిగింది. చంద్ర‌బాబు నాయుడును తాము ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. ఆయ‌న ఒక సారి వ‌చ్చి త‌న పార్టీ కార్య‌క‌ర్త‌లను ఓదార్చి వెళ్లార‌ని, ఆ త‌ర్వాత మాత్రం ఆయ‌న జాడ లేదంటూ.. వాళ్లు పోలిస్ స్టేష‌న్లో ఫిర్యాదు చేశారు. అమ‌రావ‌తి ప్ర‌యోజ‌నాల‌కు పాటు ప‌డుతూ సీమకు ద్రోహం చేయ‌డానికి కూడా చంద్ర‌బాబు నాయుడు వెనుకాడ‌టం లేద‌ని.. కుప్పం లో ఫిర్యాదు చేసిన వారు ఫైర్ అయ్యారు.