తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గులకరాయి రాజకీయం కొనసాగుతూ ఉంది. ఇలాంటి దాడులకు వెనుకాడేది లేదని చంద్రబాబు నాయుడు ఒకటికి అనేక మార్లు చెబుతూ ఉన్నారు.
అసలు ఆ గులకరాయి చంద్రబాబు మీదకు ఎలా పడింది? నిజంగా పడిందా? లేదా? అనే అంశాల గురించి భారీ ఎత్తున విచారణ కొనసాగుతూ ఉంది. ఈ విషయంపై ఇప్పటికే ఏపీ హోం మంత్రి కూడా స్పందించారు. అక్కడి పరిస్థితులను బట్టి చూస్తే గులకరాయి తో చంద్రబాబు మీద దాడి జరిగిన దాఖలాలు లేవని ఏపీ పోలీసులు చెబుతున్నారు.
మరోవైపు ఈ అంశాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్లు గవర్నర్ వద్దకు కూడా తీసుకెళ్లారు. గవర్నర్ ను కలిసి వారు కంప్లైంట్ ఇచ్చారు. చంద్రబాబుపై దాడి గురించి భారీ విచారణకు తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నట్టుంది.
మరోవైపు చంద్రబాబు మీద రాయి పడిందీ లేదూ ఏమీ లేదు, ఆయనెవరో తెలుగుదేశం పార్టీ అధినేతపై నిరసనతో షర్టు విసిరితే, దాన్ని రాళ్ల దాడిగా అభివర్ణించారనే టాక్ కూడా వినిపిస్తూ ఉంది. ఇంకోవైపు చంద్రబాబు నాయుడు అలిపిరిలో తన మీద బాంబులు విసిరితేనే భయపడలేదన్నట్టుగా భీకర ప్రసంగాలు చేస్తూ ఉన్నారు.
భయపడటం మాటేమిటో కానీ, అలిపిరిలో బాంబులు పేలితేనే చంద్రబాబుపై అప్పట్లో సానుభూతి రాలేదు. ఆ సానుభూతిని క్యాష్ చేసుకోవడానికి ముందస్తుగా ఎన్నికలకు వెళితే టీడీపీ చిత్తు చిత్తు అయ్యింది, మరి అప్పుడు రాని సానుభూతి ఇప్పుడు ఎలా వస్తుందని గులకరాయిని పట్టుకుని టీడీపీ ఇంత హంగామా చేస్తోందో అనేది ధర్మ సందేహం!