Advertisement

Advertisement


Home > Politics - Gossip

రాజీనామాకు ఓకే.. ఇంతకీ ఎవరా 10 మంది?

రాజీనామాకు ఓకే.. ఇంతకీ ఎవరా 10 మంది?

టీడీపీ నుంచి దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు. మేం ఊ అంటే గోడ దూకడానికి రెడీగా ఉన్నారు. ఇదీ రెండు రోజులుగా వైసీపీ నేతలు చెబుతున్న మాటలు. ఇందులో కొంత నిజం కూడా ఉంది. ఫలితాలు వెలువడిన మరుసటిరోజు నుంచే టీడీపీ నుంచి కొందరు వైసీపీని సంప్రదించారు. అయితే జగన్ మనసు తెలుసుకున్న వీళ్లలో కొందరు అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరీ వైసీపీలోకి వస్తామని చెబుతున్నారు. వాళ్లు ఎవరెవరు అనే విషయంలో మాత్రం వైసీపీ నేతలు పూర్తి క్లారిటీ ఇవ్వడంలేదు.

పార్టీ ఫిరాయింపులపై స్పష్టమైన వైఖరితో ఉన్నారు సీఎం జగన్. నంద్యాల ఉప ఎన్నికల సమయంలో కూడా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తర్వాతే శిల్పా చక్రపాణి రెడ్డిని వైసీపీలో చేర్చుకున్నారు. అధికారం చేతిలో లేనప్పుడే ఒక ఎమ్మెల్సీ వస్తానంటే పదవి వదులుకొని రమ్మని చెప్పిన జగన్, ఇప్పుడు మాట మార్చే అవకాశం ఎంతమాత్రం లేదు. ఇదే విషయాన్ని నిండుసభలో చెప్పారు కూడా.

దీంతో పార్టీ మారాలనుకుంటున్న టీడీపీ ఎమ్మెల్యేలు సైతం ధైర్యం చేయడానికి రెడీ అవుతున్నారు. ఎమ్మెల్యే పదవులకి రాజీనామా చేసి వైసీపీలో చేరతామంటూ ముందుకొస్తున్నారు. అయితే వీరు జగన్ ముందు రెండు కండిషన్లు పెడుతున్నారట. ఒకటి ఎమ్మెల్యే అభ్యర్థిగా తమకే అవకాశం ఇవ్వాలి, కుదరని పక్షంలో తమ కుటుంబ సభ్యులను నిలబెట్టాలి. రెండోది జగన్ తమ నియోజకవర్గంలో ప్రచారం చేయాలి. వీటికి జగన్ ఓకే అంటే వెంటనే స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా రాసిపారేస్తామంటూ ఉబలాటపడిపోతున్నారు టీడీపీ ఎమ్మెల్యేలు.

వైసీపీతో టచ్ లో ఉంటున్న టీడీపీ ఎమ్మెల్యేల్లో గంటా వర్గం ముందు ఉన్నట్టు తెలుస్తోంది. అధికారం ఎటువైపు ఉంటే అటు వెళ్లిపోవడం గంటా శ్రీనివాసరావు స్టయిల్. ఈసారి కూడా ఆయన అదే చేయబోతున్నారు. ఫలితాలు వెలువడిన మరుసటిరోజే ఓ కోటరీని తయారుచేసుకున్నారట గంటా. తనతో పాటు వైసీపీలోకి వచ్చే ఎమ్మెల్యేలందరితో ఓ గ్రూపుగా ఏర్పడి రాయబారాలు ప్రారంభించారట. ఈ గ్రూప్ లో ఎంతమంది ఉన్నారనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

ప్రస్తుతం అభివృద్ధి పథకాలపై కసరత్తు చేస్తున్న జగన్ కొన్నిరోజుల తర్వాత తన అభిప్రాయం చెబుతానని మాటిచ్చారట. ఈలోపు గ్రౌండ్ వర్క్ పూర్తి చేసుకోమని కూడా సూచించారట. టీడీపీ ఎమ్మెల్యేలను కలుపుకొనే విషయంలో రాయబారం నడిపిన కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ విషయాన్ని గుట్టుగా ఉంచారు. స్థానిక వైసీపీ నేతల్లో అసంతృప్తి చెలరేగకుండా స్మూత్ గా ఈ వ్యవహారాన్ని నడిపించాలని చూస్తున్నారు.

ఓటమిపాలైనా తుదిశ్వాస దాకా రాజకీయాల్లోనే - పవన్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?