ప్రముఖ హాస్య నటుడు, టీవీ వ్యాఖ్యాత, ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదరుడు అలీ వైసీపీ తరపున ఎంపీగా పోటీ చేయాలని ఉత్సాహపడుతున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ తరపున అలీ విస్తృతంగా ప్రచారం చేశారు. ముస్లిం మైనార్టీలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం చేయడం వైసీపీకి రాజకీయంగా కలిసొచ్చింది.
వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం జగన్తో ఆయన సన్నిహితంగా మెలుగుతున్నారు. అలీ కుమార్తె పెళ్లికి కూడా జగన్ వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ప్రభుత్వ సలహాదారుడిగా అలీని నియమించి తన అభిమానాన్ని జగన్ చాటుకున్నారు. ఇటీవల వైసీపీ సామాజిక సాధికారత సభల్లో అలీ పాల్గొంటూ, వైసీపీ ప్రభుత్వ విధానాలను ప్రశంసిస్తున్నారు. అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
ఈ నేపథ్యంలో వైసీపీ విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం మేరకు... అలీ ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆశీస్సులను ఆయన కోరుకుంటున్నారు. ముస్లిం మైనార్టీలు ఎక్కువగా ఉన్న లోక్సభ నియోజక వర్గాలపై అలీ ఆరా తీస్తున్నారు. గుంటూరు పార్లమెంట్ పరిధిలో ముస్లింలు ఎక్కువగా ఉన్నప్పటికీ, అక్కడ క్రికెటర్ అంబటి రాయుడిని జగన్ ఇప్పటికే ఖరారు చేశారని ప్రచారం జరుగుతోంది.
ఇక ఉమ్మడి కర్నూలు జిల్లాల్లోని రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎలా వుంటుందని అలీ ఆరా తీస్తున్నట్టు తెలిసింది. కర్నూలు, నంద్యాల లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ముస్లిం ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారని, ఆ రెండింటింలో ఎక్కడైనా గెలిచే అవకాశాలున్నాయని అలీ తన సన్నిహితుల వద్ద చెబుతున్నారని తెలిసింది. అయితే తాను ఏమనుకుంటున్నా, ఫైనల్గా జగన్ మనసులో ఏముందో తెలుసుకోవాలని అలీ కోరుకుంటున్నారు.
జగన్ వద్ద తన మనసులో మాట బయట పెట్టి, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే లోక్సభ బరిలో నిలవాలని అలీ ఉత్సాహం చూపుతున్నారనేది వాస్తవం.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు