ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభ్యర్థుల ఎంపికపై స్పీడ్ పెంచారు. ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా ఎక్కడెక్కడ అభ్యర్థుల్ని మార్చాలనే అంశంపై స్పష్టతకు వచ్చారు. టికెట్లు ఇవ్వని విషయాన్ని సదరు ప్రజాప్రతినిధులకు జగన్ ముందే చెప్పారు. టికెట్ ఇవ్వని ఎమ్మెల్యేలకు, భవిష్యత్లో తానేం చేస్తానో కూడా హామీ ఇచ్చారు. అయితే ముఖ్యమంత్రి హామీలతో సంతృప్తి చెందని నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. రాజకీయాల్లో ఇవన్నీ సహజమే.
ఇదిలా వుండగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఐదుగురికి సీట్లు ఇవ్వరనే చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే సదరు ప్రజాప్రతినిధులకు జగన్ సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. గత ఎన్నికల్లో కుప్పం మినహాయించి, మిగిలిన 13 చోట్ల వైసీపీనే గెలుపొందింది. ఈ దఫా కూడా అవే ఫలితాలు సాధించాలని వైసీపీ పట్టుదలతో వుంది.
ఈ నేపథ్యంలో ఐదు చోట్లు అభ్యర్థులను మార్చాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించుకున్నారు. చిత్తూరు, పలమనేరు, పూతలపట్టు, మదనపల్లె, సత్యవేడు సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చనున్నారు. వీరి స్థానాల్లో కొత్త అభ్యర్థులను ఇప్పటికే రెడీ చేసుకున్నట్టు తెలిసింది. ఇదిలా వుండగా గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం నారాయణస్వామికి ఈ దఫా టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. అక్కడ కొత్త అభ్యర్థిని నిలపనున్నారు.
అయితే నారాయణస్వామి కోరిక మేరకు ఆయన కుమార్తెకు సత్యవేడు లేదా సూళ్లూరుపేటలలో ఏదో ఒక చోట టికెట్ ఇచ్చే అవకాశాలున్నాయి. ఈ మార్పులు ఏ మేరకు సత్ఫలితాలు ఇస్తాయో చూడాలి.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు