Advertisement

Advertisement


Home > Politics - Gossip

ఈ బూతుకి అర్థం తెలుసా సైకిలు బాబూ?

ఈ బూతుకి అర్థం తెలుసా సైకిలు బాబూ?

"చెప్పేవి శ్రీరంగనీతులు- చేసేవి చిల్లరపనులు". తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇంతకంటే చెప్పడం కష్టం. 

పార్టీ పేరు పసుపంత పవిత్రం. కానీ నాయకులు నోరు తెరిస్తే మాత్రం అపవిత్రం. 

తెలుగుదేశం నాయకుల బూతుపంచాంగం ఏ స్థాయికి ఎగబాకిందంటే "భోస్ డీ కె", "నా కొడుకు" అనే లెవెల్ కి. మొదటి మాట పట్టాభి నిఘంటువులోదైతే రెండోది అయ్యనపాత్రుడి పుస్తకంలోది. అసలీ పదాలికి అర్థాలు తెలుసా సైకిలు బాబులూ? 

మొన్నటి వరకు వైసీపీ నుంచి మంత్రి కొడాలి నాని ఒక్కడే విచ్చలవిడిగా నోరేసుకుని దాడి చెసేవాడు. ఆ మాటలు వినీ వినీ చంద్రబాబు మీద సానుభూతి కలిగేలోపు తెలుగుదేశం నుంచి వారానికొక కొడాలి నాని బయటికొస్తున్నాడు. 

ఎప్పుడైనా బలవంతుడు బలహీనుణ్ణి చావబాదుతుంటే ఏదో ఒక రోజు ప్రజలకి ఆ బలహీనుడిమీద జాలి కలుగుతుంది. బలవంతుడ్ని ఆపడమో, బలహీనుడికి బలాన్ని అందించడమో చేస్తారు. కానీ చావగొట్టించుకున్న వాడు అదే దిగజారుడుతనంతో జనాన్ని పోగేసుకుని తిరగబడితే జనం చోద్యం చూస్తూ చిరాకు పడతారు తప్ప జాలిపడి చెయ్యందించి పైకి లేపరు. 

కొడాలి నాని మాటలు కించపరిచే విధంగా ఉంటాయి కానీ అసభ్యంగా ఉండవు. అయినా ఆ మాటలు అనడం కూడా తప్పే. 70 ఏళ్ళు నిండిన ఒక మాజీముఖ్యమంత్రిని అతని కొడుకుని చవట, దద్దమ్మ, సన్నాసి అని తిడుతూ వాళ్ల పూర్వీకుల పేర్లు లవంగం నాయుడు, కిస్మిస్ నాయుడు అని పదే పదే ఉటంకిస్తూ ఆత్మాభిమానం మీద దాడి చేయడం అమానుషం. 

ఇలా అనుకునే లోపు చంద్రబాబు తన పార్టీనుంచి బూతునాయకుల్ని తయారు చేసుకున్నాడు. ఎవరికి తోచినట్టు వాళ్లు రెచ్చిపోతున్నారు. 

వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ తెలుగుదేశం ప్రయత్నం ఒక్కటే..రాష్ట్రంలో అశాంతి సృష్టించడం. 

దేవాలయాల మీద దాడులన్నారు. కానీ అశాంతి ప్రబలలేదు. అదేంటో ఈ మధ్య అసలా దాడులే లేవు. జనం కనెక్ట్ కాకపోతే ఆగిపోతాయన్నమాట. 

తమ పార్టీ నేతల మీద పోలీస్ కేసుల్ని హైలైట్ చేసి నియంత ప్రభుత్వం అన్నారు. జనం అస్సలు పట్టించుకోలేదు. 

దళితులపై దాడులు జరిగిపోతున్నాయని ప్రచారం చేసారు. దానికి కూడా జనం పెద్దగా రియాక్ట్ కాలేదు. 

ఏం చేస్తే రాష్ట్రం తగలబడుతుందో ఆ పనులు చేసే ఆలోచనలో ఉన్నారు మొదటి నుంచీ. అందులో  భాగంగా ఇప్పుడు ముఖ్యమంత్రిని బూతులు తిట్టే పని మొదలు పెట్టారు. 

ఇక్కడే వైసీపీ శ్రేణులు కాస్త బుర్ర వాడాల్సింది. అలా బూతులు తిట్టిన వాళ్లమీద చట్టపరమైన చర్యలు తీసుకుంటే సరిపోతుంది ఆ మధ్య రఘురామరాజు మీద తీసుకున్నట్టు. అంతే తప్ప ఆఫీసులకి, ఇళ్లకి వెళ్లి దాడులు చేయడం వల్ల అధికార పార్టీ కూర్చున్న కొమ్మని నరికినట్టౌతుంది. జనం ఎప్పుడూ బాధితులవైపు నిలబడతారు. కనుక ప్రత్యర్థిని ఎక్కువగా విక్టిమైజ్ చేయకూడదు. 

టీడీపీ ప్రాధమికంగా సినిమా పార్టీ. వీళ్లు రాజకీయాన్ని కూడా సినిమాగానే చూస్తారు. ప్రభుత్వవ్యతిరేకత రావడానికి అనేక పాత సినిమాల్లో చూపించిన ఒకే ఒక్క అంశం హింసని ప్రేరేపించి లా అండ్ ఆర్డర్ సమస్య తీసుకురావడం. ప్రస్తుతం జరుగుతున్నది అదే. 

కనుక ప్రేరేపించినా పేట్రేగిపోకుండా సంయమనం పాటించడం వైసీపీ శ్రేణులకి ఎంతైనా అవసరం. 

తెలుగుదేశం వారుకూడా ప్రభుత్వవ్యతిరేకత తీసుకురావాలనుకుంటే మరొక సభ్యమైన మార్గాన్ని ఎంచుకోవడం అవసరం. 

శ్రీనివాసమూర్తి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?