ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఢిల్లీలో ఎంపీలకు విందు ఇచ్చారు. ఇంత కాలం ఆయన మల్కాజ్గిరి లోక్సభ సభ్యుడిగా ఉన్న సంగతి తెలిసిందే. సీఎం కావడంతో ఆ ఆనందాన్ని సహచర ఎంపీలతో పంచుకునే క్రమంలో విందు ఇచ్చారు. ఈ విందుకు ఏపీకి చెందిన అన్ని పార్టీల ఎంపీలకు ఆయన ఆహ్వానం పంపారు.
సహచర ఎంపీ తెలంగాణ సీఎం కావడంతో చాలా మంది సంతోషించారు. ఆ విందుకు వెళ్లారు. అయితే తనకు కనీసం సమాచారం ఇవ్వకుండా వెళ్లారనే కోపంతో తన పార్టీ ఎంపీలకు జగన్ క్లాస్ తీసుకున్నారనే వార్త బయటికొచ్చింది. రేవంత్ విందుకెళ్లిన వైసీపీ ఎంపీలకు జగన్ క్లాస్ తీసుకున్న మాట నిజమే.
రేవంత్రెడ్డి విందుకు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, తిరుపతి, రాజంపేట, బాపట్ల ఎంపీలు డాక్టర్ గురుమూర్తి, పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, నందిగం సురేష్ వెళ్లలేదు. వైసీపీ అభ్యర్థుల ఎంపికలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు సహాయకారిగా మిథున్రెడ్డి ఉంటున్నారు. రేవంత్ విందు ఇచ్చిన సమయంలో మిథున్రెడ్డి ఏపీలోనే ఉన్నారు. అలాగే నందిగం సురేష్ వ్యక్తిగత కారణాలతో బాపట్లలోనే ఉన్నారు.
ఇక విజయసాయిరెడ్డి విషయానికి వస్తే.. అదే రోజు ఆయన కూడా విందు ఇచ్చారు. దీంతో ఆయన వెళ్లలేదు. తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి విషయానికి వస్తే... రేవంత్రెడ్డిని చంద్రబాబు మనిషిగా చూస్తుండడంతో వెళ్లలేదని తెలిసింది. రేవంత్ విందుకు వెళ్లిన వారిలో వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, ఆదాల ప్రభాకర్రెడ్డి, మాగుంట శ్రీనివాసులరెడ్డి తదితర ఎంపీలున్నారు.
రేవంత్రెడ్డి విందుకు వెళ్లిన వారి వివరాలను ఇంటెలిజెన్స్ అధికారులు సీఎం జగన్కు నివేదిక సమర్పించారు. రేవంత్ విందుకు వెళ్లడంపై జగన్ సీరియస్ అయ్యారని, ఆయన ఎందుకలా స్పందించారో తెలియడం లేదని ఎంపీలు వాపోతున్నారు.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు