ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైసీపీలో టికెట్ల చర్చ నడుస్తోంది. ఏ ఇద్దరు వైసీపీ ప్రజాప్రతినిధులు కలిసినా... మీకు టికెట్ గ్యారెంటీనా? అని ప్రశ్నించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొందరు మంత్రులకు టికెట్ ఇవ్వరనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన మంత్రి జోగి రమేశ్ టికెట్పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ఈ దఫా ఆయనకు టికెట్ ఇవ్వరని అంటున్నారు. దీంతో సన్నిహితుల వద్ద జోగి రమేశ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెడన నుంచి జోగి రమేశ్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. రెండో దఫా కేబినెట్ విస్తరణలో ఆయనకు మంత్రి పదవి దక్కింది. సీఎం జగన్ మెప్పు కోసం ప్రత్యర్థులపై ఆయన తరచూ నోరు పారేసుకుంటుంటారు. గతంలో కరకట్టపై ఉన్న చంద్రబాబు నివాసంపైకి దాడి చేయడానికి ఆయన ప్రత్నించారు.
జోగి రమేశ్ నిత్యం వార్తల్లో వ్యక్తిగా వుంటారు. అయితే క్షేత్రస్థాయిలో జోగికి అంత బాగాలేదని సర్వే నివేదికలు చెబుతున్నాయి. దీంతో ఆయన్ను మార్చేందుకే సీఎం జగన్ మొగ్గు చూపుతున్నారని సమాచారం. జోగి స్థానంలో ఉమ్మడి కృష్ణా జిల్లా చైర్పర్సన్ ఉప్పాల హారికకు టికెట్ ఇవ్వనున్నట్టు తెలిసింది. ఈమె స్థానికురాలు కావడం కలిసొచ్చే అంశం.
పెడన నియోజకవర్గంలోని గుడ్లవల్లేరు జెడ్పీటీసీగా హారిక గెలుపొంది, ఆ తర్వాత జగన్ ఆశీస్సులతో జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవిని దక్కించుకున్నారు. జోగి రమేశ్ సామాజిక వర్గానికి చెందిన హారిక కుటుంబానికి మంచి రాజకీయ నేపథ్యం వుంది. ఈమె మామ ఉప్పాల రాంప్రసాద్కు మంచి పేరు వుంది. పెడనలో జోగి రమేశ్కు సర్దుబాటు చేసేందుకు కైకలూరు నుంచి రాంప్రసాద్ను జగన్ పోటీ చేయించారు.
జోగి రమేశ్కు నెగెటివ్ ఉన్న నేపథ్యంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన ఉప్పాల హారిక లేదా ఆమె భర్త రాముకు పెడన టికెట్ ఇవ్వాలని సీఎం ఆలోచిస్తున్నట్టు సమాచారం.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు