వైసీపీలో టికెట్లు దక్కని నేతల్లో కొందరు ధైర్యంగా నోరు విప్పుతున్నారు. ఎటూ టికెట్ దక్కదని తెలిసిన తర్వాత కూడా, వాస్తవాలేంటో చెప్పకపోతే బాగుండదనే ఉద్దేశంతో సీఎం జగన్ ఎదుట గళం విప్పుతున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం నోరు తెరిచి కాస్త నిర్మొహమాటంగా మాట్లాడ్డంతో సీఎం జగన్ ఆశ్చర్యపోయినట్టు సమాచారం.
ప్రస్తుతం రాయలసీమలో అభ్యర్థుల ఎంపికపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాపై సీఎం దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలాన్ని సీఎంవోకు పిలిపించుకున్నారు. సర్వేల్లో వ్యతిరేకత వచ్చిందని, మీపై నలుగురు సొంత పార్టీ నేతలే వ్యతిరేకంగా ఉన్నారని ఆదిమూలంతో సీఎం జగన్ అన్నట్టు తెలిసింది. దీంతో ఎమ్మెల్యే ఆశ్చర్య పోయినట్టు సమాచారం.
"నేనేం తప్పు చేశానని వ్యతిరేకిస్తున్నారన్నా. అయినా నియోజకవర్గంలో నా సొంత నిర్ణయాలేవీ జరగడం లేదు. అంతా పెద్దిరెడ్డోళ్లదే కదా పెత్తనం. వాళ్లిద్దరు మీ ఎదుటే ఉన్నారు కదా? అడగండి నేను తీసుకున్న సొంత నిర్ణయాలేవో" అని జగన్ను నిలదీసినంత పని చేసినట్టు తెలిసింది. ఇదంతా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన తనయుడు, రాజంపేట ఎంపీ మిథున్రెడ్డి సమక్షంలోనే జరిగినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
సున్నిత మనస్కుడిగా పేరు పొందిన ఆదిమూలం, కాస్త కఠినంగా మాట్లాడ్డంతో కాసేపు అందరూ మౌనం వహించినట్టు తెలిసింది. ఆదిమూలాన్ని కూల్ చేసేందుకు ఇతర నియోజకవర్గాలను ఆఫర్ చేసినట్టు సమాచారం. అయితే అక్కడికి వెళ్లేందుకు ఆదిమూలం ఒప్పుకోలేదని తెలిసింది. దీంతో ఆదిమూలానికి నచ్చ చెప్పే బాధ్యతల్ని మిథున్రెడ్డికి జగన్ అప్పగించినట్టు ప్రచారం జరుగుతోంది. ఏమవుతుందో చూడాలి.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు