ఏపీ రాజకీయానికి సంబంధించి అభ్యర్థుల వ్యవహారం ఆసక్తిదాయంగా మారింది. ఒకవైపు అధికార పక్షం ఏకంగా 38 నియోజకవర్గాలకు ఇప్పటికే దాదాపు అభ్యర్థులను తేల్చేసినట్టే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 40 అసెంబ్లీ నియోజకవర్గాల వరకూ అభ్యర్థులను మార్చవచ్చనే అంచనాలు మొదట్లో వినిపించాయి. అయితే ఆ సంఖ్య 60 వరకూ చేరిందనేది తాజా అంచనాలు. ఈ మేరకు అధికారిక ప్రకటనలు ఇంకా రాకపోయినా.. పలువురు సిట్టింగులకు సమాచారం అందిస్తున్నట్టుగా ఉన్నారు!
ఆ సంగతలా ఉంటే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్పులు చేస్తుంటే అంతకు మించిన పాపం లేదన్నట్టుగా పచ్చబ్యాచ్ రియాక్ట్ అవుతుంటే, ఇప్పుడు ఆ కూటమి అభ్యర్థుల్లోనూ ఆఖరి సమయంలో మార్పుచేర్పులు తప్పనట్టుగా ఉన్నాయి. ఇప్పుడు నడుస్తున్న టాక్ ప్రకారం చంద్రబాబు తనయుడు లోకేష్ మంగళగిరి కి ప్రత్యామ్నాయంగా మరో నియోజకవర్గం వేటలో ఉన్నాడట!
మంగళగిరిలోనే తను మళ్లీ పోటీ చేస్తానంటూ ఆ మధ్య లోకేష్ ప్రకటించారు. అయితే ఇప్పుడు సర్వేలకు అనుగుణంగా మంగళగిరిలో లోకేష్ పోటీ చేయకపోవచ్చనే మాట వినిపిస్తోంది! వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాల నేపథ్యంలో లోకేష్ మంగళగిరి నుంచి తప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతూ ఉంది.
మరి గత ఎన్నికల్లో ఓటమిని మిగిల్చిన మంగళగిరికి లోకేష్ దూరం అయితే మరోసారి ఓటమి భయంతోనే ఆయన తప్పుకున్నారనే ప్రచారం తప్పదు! కేవలం లోకేష్ మాత్రమే కాదు, పవన్ విషయంలోనూ ఇదే జరుగుతోందట. పవన్ గాజువాక నుంచి మరోసారి బరిలోకి దిగుతారనే ప్రచారం మొన్నటి వరకూ ఉండేది. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి కాకినాడ పేరు హైలెట్ అవుతోంది. ఈ మేరకు పవన్ కసరత్తు చేస్తున్నారట! గాజువాక కాకుండా కాకినాడ నుంచి పవన్ పోటీ చేయబోతున్నారనే ప్రచారం జరుగుతూ ఉంది!
అంటు మంగళగిరిలోనూ, ఇటు గాజువాకలోనూ సిట్టింగులను పక్కన పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కొత్త వ్యూహాలతో వెళ్తోంది. ఇదే సమయంలో అటు మంగళగిరి, గాజువాకల నుంచి పోటీకి లోకేష్, పవన్ వెనుకంజ వేస్తున్నారనే వార్తలు వస్తుండటం గమనార్హం! ఒకవేళ సిట్టింగులే బరిలో ఉంటే.. వీరిద్దరూ ఆయా నియోజకవర్గాల్లో దర్జాగా పోటీ చేసే అవకాశం ఉండేది. కనీసం సానుభూతి అయినా వర్కవుట్ అవుతుందనే లెక్కలుండేవి. అయితే సిట్టింగుల మార్పు నేపథ్యంలో లోకేష్, పవన్ ఇద్దరికీ ఆ ఛాన్స్ లేనట్టే!
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు