నారాలోకేష్ ప్రెస్ మీట్.. తెరవెనక ఆ నలుగురు

“మీడియా మిత్రులకు ఆహ్వానం. మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ గారి ప్రెస్ మీట్ కు తప్పనిసరిగా హాజరుకాగలరు”. ఇలాంటి స్టేట్ మెంట్ వినాలని, ఆహ్వానం అందుకోవాలని ఎంతోమంది ఆశగా ఎదురు…

“మీడియా మిత్రులకు ఆహ్వానం. మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ గారి ప్రెస్ మీట్ కు తప్పనిసరిగా హాజరుకాగలరు”. ఇలాంటి స్టేట్ మెంట్ వినాలని, ఆహ్వానం అందుకోవాలని ఎంతోమంది ఆశగా ఎదురు చూస్తున్నారు. వైసీపీ నేతలు కూడా ఎంతో ఆసక్తిగా అసలిలాంటి అద్భుతం జరుగుతుందా అని ఎదురుచూస్తున్నారు. ఇకపై ఇలాంటి ఎదురుచూపులు ఉండవు. త్వరలోనే ఈ అద్భుతం కళ్లముందు సాక్షాత్కరించబోతోంది. ఇన్నాళ్లూ ట్విట్టర్ మాటున దాక్కున్న లోకేష్ మెయిన్ మీడియా ముందుకు రాబోతున్నారు. సోలోగా ప్రెస్ మీట్ పెట్టి మరీ తన భాషా పాండిత్యాన్ని చూపించబోతున్నారు.

అయితే దానికింకా కాస్త టైమ్ ఉంది. ఆ టైమ్ ఎంత అనేది చినబాబు గారి ధారణా సామర్థ్యంపై ఆధారపడి ఉంది. గతంలో ఓసారి ఉద్ధండుల్లాంటి గురువుల దగ్గర తెలుగు పాఠాలు నేర్చుకున్నా లోకేష్ గారి భాషా పరిజ్ఞానం ఏమాత్రం మెరుగుపడలేదు. లక్షల రూపాయల ప్రజాధనాన్ని లోకేష్ ప్రైవేట్ క్లాసుల కోసం వెచ్చించినా ఫలితం కనిపించలేదు. ఎన్నికల టైమ్ లో తను స్వయంగా పోటీ చేస్తున్న మంగళగిరినే.. మందలగిరిగా మార్చిన ఘనత ఈయన సొంతం. ఇక లోకజ్ఞానం అంటారా, అది లోకేష్ కి ఎంతమాత్రం ఉందనేది అందరికంటే ఎక్కువగా టీడీపీ కార్యకర్తలకే తెలుసు.

ఇలాంటి సందర్భంలో లోకేష్ లాంటి వ్యక్తిని భావి నాయకుడిగా పరిచయం చేయాలంటే ఎలా? దీనికోసమే కిందా మీదా పడుతున్న చంద్రబాబు తనయుడి కోసం మరోసారి ప్రైవేట్ పాఠాలు చెప్పిస్తున్నారు. ఈనాడు మూలాలున్న ఇద్దరు సీనియర్ జర్నలిస్ట్ లు లోకేష్ కి తర్ఫీదు ఇస్తున్నారు. ఈ వ్యవహారం సొంత పార్టీ నాయకులకి కూడా తెలియకుండా జరుగుతోంది. ఈ సీనియర్ జర్నలిస్ట్ లకు తోడు మరో ఇద్దరు అసిస్టెంట్లు, లోకేష్ కి రోజువారీ రాజకీయ వ్యవహారాలపై సమాచార సేకరణ చేసి ఇస్తున్నారు. హైదరాబాద్ కేంద్రంగా గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యవహారం గత నెల రోజులుగా జరుగుతోంది.

మొత్తమ్మీద నలుగురు సీనియర్లు లోకేష్ ని సానబెడుతున్నారన్నమాట. లైవ్ లో ఎలా మాట్లాడాలి, విలేకరులు అడిగే ప్రశ్నలకి ఎంత వేగంగా, ఎంత నేర్పుగా సమాధానాలివ్వాలి, మాటల్లో సాంకేతిక పదాల్ని ఎలా వాడాలి, గణాంకాలను ఎలా చొప్పించాలి వంటి పాఠాలన్నీ లోకేష్ చెవిలో ఊదేస్తున్నారు. అంతేకాదు, లోకేష్ కోసం మాక్-ప్రెస్ మీట్లు కూడా పెట్టే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటివరకూ ఇచ్చిన తర్ఫీదుపై చంద్రబాబు సంతృప్తి వ్యక్తంచేశారట. ఈ ట్రైనింగ్ పూర్తయితే పందెంకోడిలా లోకేష్ ని ప్రెస్ మీట్ల కోసం వదులుతారన్నమాట.

ఇప్పటివరకూ వారితో, వీరితో పార్టీ ఆఫీస్ నుంచి మీడియాకు లైవ్ ఇస్తున్నారు. ఇకపై వీటిని కాస్త తగ్గించి లోకేష్ ని లైవ్ లో మాట్లాడేలా చేయాలనేది చంద్రబాబు ఆలోచన. చినబాబు ఈ మీడియా చిట్ చాట్ విద్యను ఎంత తొందరగా నేర్చుకుంటే, అంత తొందరగా ఆయన్ని జనాల మీదకు వదలాలని చూస్తున్నారు బాబు. ఇంతకీ తండ్రి కోర్కెను తనయుడు ఈ ఏడాదైనా తీరుస్తారా? లేక విజన్ 2020లాగా వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ చేస్తారా? వేచి చూడాలి.

 'చిరు పనైపోయినట్టే' అని నవ్విన నోళ్లు మూతబడేలా