టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. కొందరి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తేల్చుకోలేక ఇబ్బంది పడుతున్నారని తెలిసింది. చంద్రబాబునాయుడు వివిధ మార్గాల ద్వారా టీడీపీ ఇన్చార్జ్లపై నివేదికలు తెప్పించుకుంటున్నారు. అయితే సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి అభ్యర్థులపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఐదుగురు టీడీపీ ఇన్చార్జ్ల టికెట్లపై కత్తి వేలాడుతోందని సమాచారం. ఎమ్మిగనూరు (జయనాగేశ్వర్రెడ్డి), పత్తికొండ (కేఈ శ్యామ్), డోన్ (సుబ్బారెడ్డి), ఆళ్లగడ్డ (భూమా అఖిలప్రియ), నంద్యాల (ఎన్ఎండీ ఫరూక్)లపై మూడు సంస్థలతో సర్వే చేయించినట్టు తెలిసింది. వీటిలో రెండు సర్వేలు టీడీపీ ఇన్చార్జ్లకు వ్యతిరేకంగా వచ్చినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది.
దీంతో ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా టీడీపీ నాయకులు, కార్యకర్తల నుంచి ఇన్చార్జ్లకు టికెట్లు ఇస్తే మద్దతు ఇస్తారా? లేక నోటా ఆప్షన్ ఎంచుకుంటారా? అనే ప్రశ్నలతో అభిప్రాయాలు సేకరించడం గమనార్హం. ఐవీఆర్ఎస్ కాల్స్ వెళ్లాయంటే... ఆ నియోజకవర్గాల ఇన్చార్జ్లకు టికెట్ అనుమానమే అని టీడీపీలో అంతర్గతంగా చర్చ నడుస్తోంది. వీటిలో చంద్రబాబు మొట్టమొదట టికెట్ ప్రకటించిన డోన్ అభ్యర్థి సుబ్బారెడ్డి ఉండడం గమనార్హం.
అలాగే ఇటీవలే నంద్యాలకు ఇన్చార్జ్గా నియమితులైన మాజీ మంత్రి ఫరూక్కు కూడా క్షేత్రస్థాయిలో ఆశించిన స్థాయిలో ప్రజాదరణ లేదని టీడీపీకి నివేదికలు వెళ్లాయి. అయితే మైనార్టీకి టికెట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఫరూక్ను ఇన్చార్జ్గా నియమించారు. బహుశా సర్వే నివేదికలకు ఈయన మినహాయింపు ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అయితే నాలుగు మార్గాల్లో సర్వేలు చేసి, నివేదికలు తెప్పించుకుంటున్న చంద్రబాబు... చివరికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే చర్చ తెరపైకి వచ్చింది. ప్రజల్లో తగిన ఆదరణ లేని నేతలకు సీఎం జగన్ మాదిరిగా చంద్రబాబు కూడా టికెట్ నిరాకరిస్తారా? లేక భయంతో వారినే కొనసాగిస్తారా? అనే ప్రశ్నకు కాలమే జవాబు చెప్పాల్సి వుంది.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు