Advertisement

Advertisement


Home > Politics - Gossip

పవన్ కల్యాణ్ మరో ఉపేంద్రలా మారతారా..?

పవన్ కల్యాణ్ మరో ఉపేంద్రలా మారతారా..?

కన్నడ హీరో కమ్ డైరెక్టర్ ఉపేంద్ర రాజకీయ జీవితం గురించి అందరికీ తెలిసిందే. కర్నాటక ప్రజ్ఞావంతర జనతా పార్టీ పేరుతో అప్పట్లో ఓ పార్టీ పెట్టారు ఉపేంద్ర. పార్టీ కాన్సెప్ట్ ఇచ్చిన మహేష్ గౌడను వ్యవస్థాపకుడిగా ఉంచుతూ.. కేపీజేపీకి ఉపేంద్ర అధ్యక్షుడిగా వ్యవహరించారు. అయితే ఆ తర్వాత పార్టీలో లుకలుకలు వచ్చాయి. 

రాజకీయ పార్టీలంటే డబ్బుతో ముడిపడి ఉన్న వ్యవహారం, అందుకే పార్టీ ఫండ్ వసూలు చేయాలన్నారు మహేష్ గౌడ. ఇది నచ్చని ఉపేంద్ర పార్టీ నుంచి బయటకొచ్చేశారు. తాను పార్టీ స్థాపించి, దాన్ని వేరేవారి చేతిలో పెట్టేశారు. ఒకరకంగా ఆయన పార్టీ పెడుతున్నాననేసరికి అందరూ లోపలికి వచ్చారు. చివరకు ఉపేంద్రను బయటకు తోసేశారు. ఆ తర్వాత ప్రజాకీయ పార్టీ అంటూ మరో ప్రస్థానాన్ని మొదలు పెట్టారు ఉపేంద్ర.

ఉపేంద్రకి పవన్ కి లింకేంటి..?

ఉపేంద్రలో ఫైర్ ఉంది, పవన్ లోనూ కసి ఉంది. ఇద్దరూ రాజకీయాల్లోకి వచ్చి అర్జెంట్ గా ప్రజాస్వామ్యానికి కొత్త అర్థమివ్వాలనుకున్నారు. అది సాధ్యం కాదని తెలిశాక ఇద్దరూ సైలెంట్ అయ్యారు. ఓటుకు నోటు ఇవ్వను అంటారు ఉపేంద్ర, పవన్ ది కూడా అదే పాలసీ. అయితే ఇప్పుడు ఉపేంద్ర పార్టీలాగే, పవన్ స్థాపించిన జనసేనలో కూడా లోలోపల వ్యవహారం ముదిరి పాకాన పడుతోందనే అనుమానాలు బలపడుతున్నాయి.

పవన్ కల్యాణ్ చేయాలనుకుంటున్న రాజకీయం వేరు, జనసైనికులు కోరుకుంటున్న రాజకీయం వేరు. దీంతో పవన్ విధానాలు నచ్చనివారు ఒక్కొక్కరే పార్టీని వీడుతున్నారు. నాదెండ్ల మనోహర్ సహా ఇప్పుడు పార్టీలో ఉన్నవారికి కూడా పవన్ రాజకీయాలు నచ్చడం లేదు, వారు ఏదోలా పవన్ లో మార్పు కోరుకుంటున్నారు.

పవన్ మారతారా..? వవన్ నే మార్చేస్తారా..?

ఇప్పటివరకూ జనసేనకు కర్త కర్మ క్రియ అన్నీ పవన్ కల్యాణే. రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ గా ఉన్న నాదెండ్ల మనోహర్ కేవలం పవన్ కల్యాణ్ ప్రెస్ నోట్లు మాత్రమే చదువుతూ వస్తున్నారు. అప్పుడప్పుడు వాటిపై సంతకాలు పెడుతున్నారు. అంతకుమించి ఆయన ఏం చేయాలనుకోవడంలేదు, పవన్ కూడా ఆయనకు అంతకు మించి పెద్ద సీన్ ఇవ్వాలనుకోలేదు. 

అయితే ఇటీవల మనోహర్ తనకు తానుగా నేరుగా ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. సోలో హీరోగా పర్ఫామెన్స్ ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. టీడీపీ అనుకూల మీడియా ఈ విషయంలో మరింత ఫోకస్ గా ఉంటోంది. మనోహర్ ని బాగా హైలెట్ చేస్తోంది.

తాజాగా కాకినాడలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులపై మనోహర్ ఓ రేంజ్ లో పైర్ అయ్యారు. గణాంకాలతో సహా విరుచుకుపడ్డారు. ఏపీని అప్పుల కుప్పలా మార్చేస్తున్నారని, అగాధంలోకి నెట్టేస్తున్నారని, జాతీయ స్థాయిలో రాష్ట్రం పరువు తీసేస్తున్నారని విమర్శించారు.

గతంలో ఇలాంటి ప్రకటనలన్నీ పవన్ పేరుతో విడుదలయ్యేవి, వాటిని నాదెండ్ల చదివి వినిపించేవారు. కానీ ఇప్పుడు నేరుగా ఆయనే సీన్ లోకి వచ్చారు. కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అంటే పవన్ పరోక్షంలో మనోహర్ హీరో అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారా.. లేక టీడీపీ అనుకూల మీడియా ఆయన్ను అలా రెచ్చగొడుతోందా..? అనేది తేలాల్సి ఉంది.

పవన్ తో వైసీపీని తిట్టించాలి, కానీ ఆయన సినిమాల్లోకి వెళ్లేసరికి ఆ ఎపిసోడ్ మిస్ అయింది. అందుకే నాదెండ్లతో ఆ పని కానిచ్చేస్తోంది టీడీపీ అనుకూల మీడియా. పవన్ పరోక్షంలో ఆయన్ను హైలెట్ చేస్తోంది. ఒకరకంగా పవన్ కంటే నాదెండ్లకే పార్టీ నాయకులతో ఎక్కువ పరిచయాలున్నాయి. కింది స్థాయి నాయకులతో కూడా నేరుగా మాట్లాడి వ్యవహారాలు చక్కదిద్దగల నేర్పు కూడా ఉంది.

నాదెండ్లకు పార్టీపై ఉన్నఈ పట్టునే టీడీపీ ఇప్పుడు వాడుకుంటోంది. పవన్ ను సైడ్ లైన్ చేసి నాదెండ్ల స్టేట్ మెంట్స్ కు విపరీత ప్రాధాన్యం ఇస్తోంది. అటు పవన్ మాత్రం తన సినిమాలు తాను చేసుకుంటూ బిజీ అయిపోతున్నారు. ఇలానే పరిస్థితి కొనసాగితే.. రాబోయే రోజుల్లో పవన్, మరో ఉపేంద్రలా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?