తను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడటం లేదని ప్రకటించుకున్నారు నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. తన చివరి రక్తం బొట్టున్నంత వరకూ తను జగన్ వెంటే ఉన్నానంటూ ఈ ఎమ్మెల్యే ప్రకటించుకున్నారు.
గత కొన్ని రోజులుగా ప్రసన్నకుమార్ రెడ్డి పార్టీ మారతారు అనే ప్రచారం జరుగుతూ ఉంది. నెల్లూరు జిల్లాకే చెందిన మేకపాటి చంద్రశేఖర రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డిల తిరుగుబాటు నేపథ్యంలో నల్లపురెడ్డి ఇదే బాటన నడుస్తారనే ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుతానికి అయితే ప్రసన్నకుమార్ రెడ్డి వివరణ ఇచ్చుకున్నారు.
ఆ సంగతలా ఉంటే.. నెల్లూరు జిల్లాకే చెందిన మరో ఎమ్మెల్యే పేరు కూడా ఈ తరహాలో వినిపిస్తోంది. ఆయనే రామి రెడ్డి ప్రతాపరెడ్డి. ఈ కావలి ఎమ్మెల్యే కూడా పక్క చూపులు చూస్తున్నారనేది ఆఫ్ ద రికార్డుగా జరుగుతున్న ప్రచారం. ఇందుకు రామి రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు ఏమో కానీ, ఈ ప్రచారానికి ప్రధాన కారణం.. ఆయనకు టికెట్ దక్కదనే ప్రచారం.
వచ్చే ఎన్నికల్లో కావలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ప్రతాపరెడ్డికి దక్కదనే టాక్ ఉంది. జగన్ సర్వేల్లో ఆయనకు వ్యతిరేక ఫలితాలు వచ్చాయని, ఆయన అభ్యర్థిత్వంపై వ్యతిరేకత నేపథ్యంలో ఇక్కడ మరో అభ్యర్థిని బరిలోకి దించడానికి జగన్ రెడీ అవుతున్నారనే ప్రచారం ఉంది. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య ప్రశాంతి రెడ్డి కావలి నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయనే ప్రచారం కొన్నాళ్లుగా ఉంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే టికెట్ దక్కని పక్షంలో ప్రతాపరెడ్డి పక్క చూపులు చూసే అవకాశం ఉండనే ఉండచ్చు అనే ఊహాగానాలతో ఈ పుకార్లు చెలరేగుతున్నాయి.
2014, 2019లలో రామిరెడ్డి ప్రతాపరెడ్డి కావలి నుంచి విజయం సాధించారు. విశేషం ఏమిటంటే..2019 ఎన్నికల ముందు కూడా ప్రతాపరెడ్డికి కావలి టికెట్ దక్కదనే ప్రచారం గట్టిగా జరిగింది. ఆయనైతే ఓటమి ఖాయమనే టాక్ కూడా అప్పుడు సాగింది. కానీ అప్పుడు ప్రతాపరెడ్డికే జగన్ కేటాయించారు. ఆయన విజయం సాధించారు.