Advertisement

Advertisement


Home > Politics - Gossip

వాళ్లను వాళ్లే కాల్చి చంపుకున్నారట

వాళ్లను వాళ్లే కాల్చి చంపుకున్నారట

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ఆందోళన కారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఏకంగా పాతికమందికి పైగా చనిపోతే.. ఆ రాష్ట్ర  ముఖ్యమంత్రి మాత్రం.. వాళ్లను వాళ్లే కాల్చుకుని చచ్చిపోయారని సెలవిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో పౌరసత్వ సవరణ చట్టానికి నిరసనగా జరిగిన ప్రదర్శనలో దారుణాలు చోటుచేసుకున్నాయి.  డిసెంబర్ లో జరిగిన దుర్ఘటనలో పాతికమంది దాకా చనిపోయారు. పోలీసులు కాల్పులు చేయడంతోపాటు,  ఆందోళనకారుల వైపు నుంచి కూడా కాల్పులు జరిగాయి.  అయితే కొందరు పోలీసులకు గాయాలు అయినట్టు చెబుతున్నప్పటికీ…  పోలీసుల్లో ఏ ఒక్కరూ మరణించడం జరగలేదు.  కానీ ఆందోళనకారులు మాత్రం పాతిక మంది దాకా చనిపోయారు.

ఈ విషయంపై గత రెండు నెలలుగా దేశవ్యాప్తంగా చర్చోప చర్చలు జరుగుతూనే ఉన్నాయి.  ఉత్తరప్రదేశ్  లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించిందని పలువురు విమర్శిస్తున్నారు.  ఈ మరణాలకు ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి అని అంటున్నారు.

దీనికి సంబంధించి జరుగుతుండగా యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ శాసనసభలో మాట్లాడుతూ మరింత రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. పోలీసు కాల్పుల్లో ఏ ఒక్కరూ కూడా చనిపోలేదని ఆయన అన్నారు. మరణించిన వారందరూ ఆందోళనకారుల తుపాకీ గుళ్ళకు  బలి అయ్యారు అనేది ముఖ్యమంత్రి ఉవాచ.  అంటే ఆయన మాటల ప్రకారం ఆందోళన చేస్తూ చేస్తూ వాళ్ళని వాళ్ళే కాల్చుకుని చనిపోయారన్నమాట !

పైగా యోగి ఆదిత్యనాథ్  ముస్లిం ఆందోళనకారులను ఉద్దేశించి మరింత రెచ్చగొట్టే కామెంట్లు కూడా చేశారు.  మరణించడానికి సిద్ధపడి వచ్చినవారు…  సజీవంగా ఎలా తిరిగి వెళతారు? అనేది ఆయన వాదన.  ఇందులో చాలా తీవ్రమైన భావం ఉన్నదని పలువురు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనలకు దిగే వారిని బతకనివ్వబోమని హెచ్చరిస్తున్నట్లుగా మాటలు ఉన్నాయనే అభిప్రాయం పలువురికి కలుగుతోంది.

ప్రధాని నరేంద్ర మోడీ అయినా, కమలదళం పెద్ద మనుషులు అయినా జోక్యం చేసుకుని యోగి ఆదిత్యనాథ్ దుడుకు తనానికి బ్రేకులు వేయకపోతే పార్టీకి చేటు జరుగుతుందని పలువురు విశ్లేషిస్తున్నారు.

అంత ధైర్యం ఎవడికైనా ఉందా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?