ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు సన్నిహితుడైన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఏపీలో రూట్ మార్చారు. గత ఎన్నికల్లో వైసీపీకి వ్యూహకర్తగా పని చేసిన పీకే, ఈ ఎన్నికల్లో టీడీపీతో ఒప్పందం చేసుకోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. అసలు సీఎం జగన్తో పీకేకి ఎక్కడ చెడిందనే ప్రశ్న ఉత్పన్నమైంది.
విశ్వసనీయ వర్గాల కథనం మేరకు తనను జగన్ అవమానించారని మనస్తాపం చెందిన పీకే... ఇప్పుడు టీడీపీ గెలుపు కోసం పని చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. అయితే పరిపాలనా పరమైన అంశాల్లో పీకే జోక్యం చేసుకుంటుండడంతో జగన్ వారించారని, దాన్ని జీర్ణించుకోలేకే టీడీపీ పంచన చేరారనే ప్రచారం మరోవైపు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చాలా కాలం జగన్తో పీకే సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. ఈ క్రమంలో జనసేనాని పవన్కల్యాణ్తో వైరం వద్దని, అతనిపై వ్యక్తిగత విమర్శలు చేయడం వల్ల రానున్న ఎన్నికల్లో రాజకీయంగా నష్టపోతావని జగన్ను హెచ్చరించినట్టు తెలిసింది. పవన్ విషయంలో తన సూచనల్ని పెడచెవిన పెట్టడాన్ని పీకే సీరియస్గా తీసుకున్నారు.
అలాగే మూడు రాజధానుల ఏర్పాటు ఆలోచన మంచిది కాదని జగన్కు పీకే సూచించారు. దాన్ని వెనక్కి తీసుకుంటే మంచిదని పీకే సలహా ఇచ్చారు. అలాగే ఇతరత్రా పరిపాలనా పరమైన అంశాల్లో జగన్కు పీకే సలహాలిచ్చారు.
ఇవన్నీ జగన్ శ్రేయస్సు కోసం ఇచ్చానని పీకే చెబుతున్నారు. కానీ జగన్ అలా భావించడం లేదు. కేవలం రాజకీయ పరమైన సూచనల వరకే పరిమితం కావాల్సిన పీకే, అందుకు విరుద్ధంగా పరిపాలన విషయాల్లో జోక్యం చేసుకోవడాన్ని తట్టుకోలేకపోయారు.
సోషల్ మీడియా వరకూ చూసుకోవాలని, అంతకు మించి మీ జోక్యం అవసరం లేదని, పాలనాపరమైన అంశాల్లో సలహాలిచ్చే స్థాయి కాదని తెలుసుకోవాలని పీకేకి గట్టిగానే జగన్ క్లాస్ తీసుకున్నట్టు సమాచారం. ఈ సమాచారం పీకేతో పాటు ప్రస్తుతం ఆయన్ను ఆదరించిన టీడీపీ నేతల నుంచి రావడం గమనార్హం.
మొత్తానికి జగన్, పీకే మధ్య ఇగో సమస్యే విడిపోవడానికి కారణమైందనేది వాస్తవం. ఎన్నికల సమయంలో వ్యూహకర్తగా నియమించుకున్నానే తప్ప, ఆ తర్వాత ప్రభుత్వంలో సలహాదారుడి పాత్ర పోషిస్తే ఎలా అనేది జగన్ ప్రశ్న. వైసీపీని ఓడించడానికి కసిగా పని చేయాలనే పట్టుదలతో పీకే ఉన్నారు. మరి టీడీపీకి ఆయన ఇచ్చే సలహాలేంటో చూడాలి.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు