వాళ్లకి డబ్బులు పంచేస్తున్నాడు..వీళ్లకు డబ్బులు ఇచ్చేస్తున్నాడు. జనాల్ని సోమరిపోతుల్ని చేసేస్తున్నాడు. రాష్ట్రాన్ని గుల్ల చేసేస్తున్నాడు. ఇదే సదా ప్రతిపక్షాల గొడవ వైఎస్ జగన్ నగదు బదిలీ స్కీముల గురించి. నిజానికి జగన్ కాస్త ఎక్కువ దూరం వెళ్తే, అసలు ఆ ప్రయాణం ప్రారంభించింది చంద్రబాబే.
ఉచితంగా సరుకులు, 70 రూపాయల భోజనం అయిదు రూపాయలకు, పసుపు కుంకుమ అంటూ పదివేలు. ఆయన వ్యవహారాలు ఆయనా చేసారు. జగన్ వచ్చిన తరువాత మధ్యలో తినేసే వారు లేకుండా నేరుగా జనాల అక్కౌంట్లలో డబ్బులు వేయడం ప్రారంభించారు.
ఇప్పుడు జాతీయ పార్టీ అయిన భాజపా కూడా ఇదే రాగం అందుకుంది. యుపి ఎన్నికల మేనిఫెస్టో లో అదే బాట పట్టింది. ఇక లోకల్ పార్టీ ల సంగతి చెప్పనక్కరే లేదు.
ఆటోవాలాలకు నెలల మూడు లీటర్ల పెట్రోలు.
టూ వీలర్ వున్నవారికి నెలకు ఓ లీటరు..
అమ్మాయిలకు ఉచిత విద్య
దిగువ కుటుంబాలకు ఉచిత గ్యాస్ సిలెండర్లు
ఉచితంగా ట్యాబ్ లు, ల్యాప్ టాప్ లు
ఇంకా..ఇంకా.
అంతే కాదు జగన్ తలపెట్టిన మాదిరిగానే ప్రతి ఙిల్లా కేంద్రంలో ఓ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి.
ఉత్తర ప్రదేశ్ మహా గొప్ప ధనికరాష్ట్రం ఏమీ కాదు. అయినా కూడా ఎన్నికల మాని ఫెస్టోలు ఈ విధంగా తయారు చేసారు. రేపు భవిష్యత్ లో భాజపా ఆంధ్ర లీడర్లు ఏ హక్కుతో జగన్ ను, ఆయన స్కీములను విమర్శించగలరు?
వారి సంగతి పక్కన పెడితే భవిష్యత్ లో ఆంధ్రలో కూడా భాజపా మేనిఫెస్టో ఇదే మాదిరిగా, మరింత ఉచితాలో వుండే అవకాశం వుంది. వైకాపా ఎలాగూ తన బాణీ కొనసాగిస్తుంది. అలాంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కూడా జగన్ ఉచిత పథకాలు కొనసాగించము అని చెప్పే పరిస్థితి వుండదు. కొనసాగిస్తాము అంటే జగన్ బాట ను అంగీకరించినట్లే.
మొత్తానికి ఎన్నికల వేళకు ఆంధ్రలో మేనిఫెస్టోలు ఉచితాలు, పంపిణీలతో కళకళలాడతాయి.