రాజకీయాల్లో ప్రత్యర్థులే తప్ప శత్రువులు ఉండరని అంటారు. కానీ ఇవన్నీ చెప్పుకునేందుకు తప్ప మరెందుకూ పనికి రావు. రాజకీయాల్లో జగన్, జేసీ కుటుంబాల మధ్య గత కొన్నేళ్లుగా శత్రుత్వం నెలకుంది.
ఇందుకు అనేక ఘటనలను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అలాంటి బద్ద శత్రువైన జేసీ ప్రభాకర్రెడ్డి నుంచి జగన్పై పొగడ్తలను ఆశించడం, ఊహించడం లాంటివి చేయొచ్చా? అంటే ఔననే సమాధానమే వస్తోంది.
ఈ రోజు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్గా జేసీ ప్రభాకర్రెడ్డి ఎన్నికయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై ప్రశంసల వర్షం కురిపించారు. జగన్ నైతిక విలువలున్న వ్యక్తి అని కొనయాడారు. అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహకారం లేకపోయి ఉంటే తాను మున్సిపల్ చైర్మన్గా ఎన్నికయ్యే వాడిని కాదని తేల్చి చెప్పారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాను ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల్ని రాజీనామాలు లేకుండా పార్టీలో చేర్చుకోననే స్వీయ నిబంధనకు కట్టుబడి ఉండడం వల్లే తాడిపత్రిలో సాఫీగా తాను చైర్మన్గా ఎన్నికైనట్టు జేసీ ప్రభాకర్రెడ్డి చెప్పుకొచ్చారు. అలాగే తమ అభ్యర్థులు కూడా గట్టిగా నిలబడ్డారన్నారు.
అలాగే తాడిపత్రి మున్సిపాల్టీ అభివృద్ధి కోసం సీఎం జగన్ను కలుస్తానన్నారు. తాడిపత్రి మున్సిపాల్టీ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పెద్దారెడ్డి, ఎంపీ రంగయ్యతో కలిసి పనిచేస్తానని ప్రభాకర్రెడ్డి తెలిపారు. తమ మధ్య ఆస్తుల వివాదాలేవీ లేవని ఆయన స్పష్టం చేశారు.